

మన న్యూస్ , నెల్లూరు: నెల్లూరు రాంజీ నగర్ లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర నియోజకవర్గ కార్యాలయంలో గురువారం వైఎస్ఆర్సిపి జిల్లా యువజన విభాగం అధ్యక్షులు, కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున ,వైసిపి జిల్లా విద్యార్ధి విభాగం అధ్యక్షులు ఆశ్రిత రెడ్డి పాత్రికేయ సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఊటుకూరు నాగార్జున మాట్లాడుతూ……. ఏడాది కాలం పూర్తయినప్పటికీ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో ప్రజలు ఈ ప్రభుత్వాన్ని అసహ్యించుకుంటున్నారని తెలిపారు. అనేక వర్గాల ప్రజలు కూటమి ప్రభుత్వానికి ఓటు వేసి గెలిపిస్తే ఈ రోజు అదే ప్రభుత్వం చేతుల్లో ప్రజలు దగాకు గురయ్యారన్నారు.ముఖ్యంగా ప్రభుత్వం యువతకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకుండా వారికి మొండి చెయ్యి చూపింది అని అన్నారు.ఏడాదికి నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్న కూటమి ప్రభుత్వ మాటలు నీటి మూటలుగా మారాయి అన్నారు.ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం పూర్తవుతున్నప్పటికీ చంద్రబాబు నాయుడు యువతకు ఒక్క ప్రభుత్వ ఉద్యోగం కూడా కల్పించలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. యువతకి ఇస్తామన్న 3 వేల రూపాయల నిరుద్యోగ భృతికి కూడా ఈ ప్రభుత్వం మంగళం పాడిందన్నారు. గత ప్రభుత్వంలో నియమించిన వాలంటీర్లను, మొబైల్ రేషన్ ప్రతినిధులను తొలగించి వారి జీవితాన్ని రోడ్డున పడేసారని ఆందోళన వ్యక్తం చేశారు.ప్రజలను మోసం చేయడమే కాకుండా.. ఏడాదికాలంగా ప్రభుత్వ అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఆడపిల్లలపై అఘాయిత్యాలు , హత్యలు, మానభంగాలు పెచ్చు మీరిపోయాయని మండిపడ్డారు. ఆడపిల్లలపై జరుగుతున్న ఆకృత్యాలను నివారించడంలో.. ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. అనంతపురంలో జూన్ 4వ తేదీ బాలిక కనబడడం లేదని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు ఇస్తే.. వారు పట్టించుకోకపోవడంతో.. ఆరు రోజుల తర్వాత ఆ బాలిక శవమై తేలిందన్నారు. అలాగే సత్యసాయి జిల్లాలో మైనర్ బాలికను 14 మంది రేప్ చేస్తే.. ఇంతవరకు వారిపై చర్యలు శూన్యమన్నారు. ఎన్నికలకు ముందు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..సుగాలి ప్రీతి హత్య ను.. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ కేసు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని.. పూనకంతో ఊగిపోయి.. ఓటు బ్యాంకు పాలిటిక్స్ చేశారని మండిపడ్డారు. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ.. ఆ కేసుకు సంబంధించి నిజా, నిజాలను నీకు తేలుస్తామన్న.. పవన్ కళ్యాణ్.. ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. వకీల్ సాబ్ సినిమాలో లాగా ప్రజలకు న్యాయం చేస్తారనుకున్న పవన్ కళ్యాణ్.. ఈరోజు చంద్రబాబు ఏది చెబితే అదే వేదం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యంగా.. పవన్ కళ్యాణ్ మాటలు నమ్మి కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేసిన.. యువత ను ఆయన నిలువునా మోసం చేశారన్నారు. కూటమి ప్రభుత్వ.. అబద్ధపు హామీలను, ఆకృత్యాలను, ప్రశ్నించిన వైసిపి నేతలపై కేసులు పెట్టి కక్ష్య సాధింపులకు దిగుతున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ ఏడాది దుర్మార్గపు పాలనకు నిరసనగా.. వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు జక్కంపూడి రాజా, వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు సిటీ ఇంచార్జ్ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి సూచనల మేరకు నిరసన ర్యాలీ చేపడుతున్నామని తెలిపారు జూన్ 13వ తేదీ ఉదయం 9 గంటలకు నెల్లూరు బారకాసు సెంటర్ నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీ చేపట్టి.. కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి.. యువత విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివచ్చి.. కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. తర్వాత విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు ఆశ్రిత రెడ్డి మాట్లాడుతూ……. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదికాలం పూర్తయినప్పటికీ విద్యార్థులకు.. ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకపోవడం దుర్మార్గమన్నారు. లోకేష్ యువగళంలో చెప్పిన హామీలన్నీటి మరచి.. ఈరోజు నిలువునా యువతను దగా చేశారని మండిపడ్డారు. విద్యార్థులకు ఐదు క్వార్టర్ల ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాల్సి ఉండగా.. కేవలం ఒకటిన్నర క్వార్టర్ కు .. సంబంధించిన ఫీజు రీఎంబర్స్ మెంట్ మాత్రమే చెల్లించారని.. దీంతో విద్యార్థులు ఎంతో ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ప్రభుత్వం చేస్తున్న నిర్వాకంతో.. చదువులు పూర్తయిన వారు కళాశాలలకు ఫీజులు చెల్లించలేక తమ సర్టిఫికెట్లను కళాశాల నుండి తీసుకోలేక.. ఆర్థిక భారంతో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన.. విద్యాసంస్కరణలను అమలు చేయకుండా.. కూటమి ప్రభుత్వం విద్యాశాఖను నిర్వీర్యం చేస్తుందన్నారు.
