Mana News :- తిరుపతి, నవంబర్ 21(మన న్యూస్ ):- తిరుమలను పక్కా ప్రణాళికతో కూడిన మోడల్‌ టౌన్‌గా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని టీటీడీ ఈవో జే. శ్యామలరావు తెలిపారు.తిరుపతిలోని పరిపాలన భవనంలోని మీటింగ్‌ హాల్‌లో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హిందూ ధార్మిక కేంద్రమైన తిరుమలను మోడల్ టౌన్‌గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా డిజైన్లు రూపొందించాలన్నారు. ఇందుకోసం విజన్ డాక్యుమెంట్ తక్షణావసరం అని, టీటీడీకి అర్బన్ డెవలప్‌మెంట్ అండ్ టౌన్ ప్లానింగ్ వింగ్‌ను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. తిరుమలలో పాదచారులకు అనుకూలంగా ఫుట్‌పాత్‌లను మార్చడంతోపాటు ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు అవసరమైన నిర్మాణాలు, స్మార్ట్ పార్కింగ్ సౌకర్యాలు కల్పించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. కొన్ని పాత కాటేజీలతో పాటు బాలాజీ ఆర్టీసీ బస్టాండ్‌ను కూడా కొత్తగా నిర్మాణం చేయాల్సి ఉందన్నారు. రాబోయే 25 సంవత్సరాల భవిష్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని డాక్యుమెంట్ను రూపొందించి దాని ప్రకారం మౌళిక సదుపాయాలు రూపొందించే ఆలోచన ఉందన్నారు. ఇందుకు టౌన్ ప్లానింగ్ లో నిపుణులైన రిటైర్డ్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్‌ను సలహాదారుగా నియమించామన్నారు. తిరుమలలో మరింతగా ఆధ్యాత్మికత వాతావరణం ఉండేలా ప్రస్తుతం ఉన్న కాటేజీలకు 150 పేర్లు పెట్టి, వాటినే కాటేజీ దాతలు ఎంపిక చేసుకుని పేర్లను మార్చేలా టిటిడి బోర్డు నిర్ణయం తీసుకుందన్నారు. తిరుమలలో పేరుకుపోయిన వ్యర్థాలను కూడా వచ్చే రెండు, మూడు నెలల్లో తొలగిస్తామని ఈవో తెలిపారు. తిరుమలలో మరింతగా ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా చూడడమే టీటీడీ అంతిమ లక్ష్యం’’ అని ఆయన తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *