మనన్యూస్,చంద్ర గిరి:చంద్రగిరి నియోజకవర్గ జనసేన పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, అరవ శ్రీధర్ లు ప్రారంభించారు. ఆదివారం ఉదయం నాగాలమ్మ క్రాస్ నుంచి బైక్ ర్యాలీగా ఎమ్మెల్యేలు, జనసేన నాయకులు బయలుదేరి క్లాక్ టవర్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కొత్తపేటలోని పార్టీ కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరణ చేసిన తరువాత కార్యాలయాన్ని ఎమ్మెల్యే లు ఆరణి శ్రీనివాసులు, అరవ శ్రీధర్ లు పార్రంభించారు. చంద్రగిరిలో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభించుకోవడం సంతోషమని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చెప్పారు. పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి కుల,మతాలకు అతీతంగా పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన కోరారు. రానున్న స్థానిక సంస్థల నాటికి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జనసేన పార్టీ బలపడి అన్ని ఎన్నికల్లో పోటీకి నాయకులు సిద్ధం కావాలని ఆయన కోరారు. కూటమిలో ఉన్నందున తెలుగుదేశం పార్టీ, బిజేపిలను కలుపుకుని సమన్వయంతో ముందుకు పోవాలని ఆయన సూచించారు. చంద్రగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే పులివర్తి నాని సహకారంతో సమస్యలు పరిష్కరించుకోవచ్చని ఆయన చెప్పారు. చంద్రగిరి నియోజకవర్గంలో పార్టీ కార్యాలయం ప్రారంభించుకోవడం శుభపరిణామమని కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ చెప్పారు. జనసేన బలోపేతం జనశ్రేణుల ముందున్న లక్ష్యమని ఆయన తెలిపారు. అధికారమే పరమావధిగా కాకుండా ఆశయాల సాధనకే పవన్ కళ్యాణ్ పార్టీని ఏర్పాటు చేశారని జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో జనశ్రేణులు కృషి చేయాలని ఆయన కోరారు. ఎన్డీఏ ప్రభుత్వాలు కేంద్రంలో, రాష్ట్రంలో ఏర్పాటు కావడానికి పవన్ కళ్యాణ్ తీసుకున్ననిర్ణయమే కారణమని ఆయన చెప్పారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతం కోసమే పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు జనసేన చంద్రగిరి నియోజకవర్గ ఇన్చార్జీ దేవర మనోహర్ తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారంలో జనసైనికులు తమ వంతు కృషి చేస్తున్నారని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉన్నందున అధికారులు కూటమి పార్టీ నేతలను గౌరవించి సమస్యల పరిష్కారానికి సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు తాతంశెట్టి నాగేంద్ర, ఆకేపాటి సుభాషిణి, రాజారెడ్డి, టిడిపి నాయకులు దొడ్ల కరుణాకర్ రెడ్డి, బిజేపి నియోజకవర్గ ఇన్చార్జీ మెడసాని పురుషోత్తం నాయుడు తదితరులు పాల్గొన్నారు.
