శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం (ఎస్వీయూ) ఆర్థిక శాస్త్ర విభాగానికి చెందిన పరిశోధక విద్యార్థి,తుడా చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డా|| డాలర్స్ దివాకర్ రెడ్డి కి పిహెచ్.డి డిగ్రీ ప్రధానం చేసినట్లు వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డా బి. రాజమాణిక్యం ఒక అధికారిక ప్రకటనలో తెలిపారు.

ఆర్థిక శాస్త్ర విభాగానికి చెందిన ప్రముఖ ఆచార్యులు ప్రొఫెసర్ జి. సవరయ్య పర్యవేక్షణలో అలాగే కో-రీసెర్చ్ సూపర్వైజర్ ప్రొఫెసర్ ఆర్. సునీత మార్గదర్శకత్వంలో డా||డాలర్స్ దివాకర్ రెడ్డి తన పరిశోధనను పూర్తి చేశారు.

“కౌలు రైతుల ఆర్థిక పరిస్థితులు: చిత్తూరు జిల్లాలో ఒక కేస్ స్టడీ” (Economic Conditions of Tenant Farmers: A Case Study in Chittoor District) అనే సామాజిక ప్రాధాన్యత కలిగిన అంశంపై ఆయన సుదీర్ఘ పరిశోధన చేసి, రూపొందించిన పరిశోధన గ్రంథాన్ని విశ్వవిద్యాలయానికి సమర్పించినట్లు కంట్రోలర్ వివరించారు.

పరిశోధనలో భాగంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో సుమారు 312 మంది కౌలు రైతుల కుటుంబాల సామాజిక, ఆర్థిక పరిస్థితులను, వారు ఎదుర్కొంటున్న సవాళ్లను డా||దివాకర్ రెడ్డి నిశితంగా విశ్లేషించారు.

వ్యవసాయ రంగంలో కౌలు రైతుల పెట్టుబడులు, అప్పుల భారం, ప్రభుత్వ పథకాల లబ్ధి తదితర అంశాలను శాస్త్రీయంగా తన గ్రంథంలో పొందుపరిచారు.

తన పరిశోధనా కాలంలో డా|| డాలర్స్ దివాకర్ రెడ్డి రాసిన పలు అత్యుత్తమ పరిశోధనా పత్రాలు ప్రతిష్టాత్మక జాతీయ, అంతర్జాతీయ పరిశోధనా జర్నల్స్ లో ప్రచురితమయ్యాయి.

రాజకీయ, సామాజిక పదవుల్లో తీరిక లేకుండా ఉంటూనే, సమాజానికి ఉపయోగపడే కౌలు రైతుల అంశంపై డా|| డాలర్స్ దివాకర్ రెడ్డి డాక్టరేట్ సాధించడం పట్ల వర్సిటీలో హర్షం వ్యక్తమవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *