రేణిగుంట మే 19:

రేణిగుంట మండలంలోని తారకరామ నగర్‌లో వెలసిన శ్రీ శ్రీ శ్రీ పర్వతాల గంగమ్మ జాతర మంగళవారం అత్యంత వైభవంగా, కన్నులపండుగగా జరిగింది. వేకువజామున అమ్మవారికి నిర్వహించిన ప్రత్యేక పూజలు, అభిషేకాలు, విశేష అలంకరణలతో జాతర మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది. అనంతరం భక్తుల దర్శనార్థం సర్వాంగ సుందరంగా ముస్తాబైన గంగమ్మ తల్లి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి సాంప్రదాయబద్ధంగా అంబలిని సమర్పించారు. కాయ, కర్పూరం, ఫలపుష్పాలను సమర్పించి తమ మొక్కులను భక్తిశ్రద్ధలతో తీర్చుకున్నారు.
సాయంత్రం వేళల్లో మహిళలు ఆలయ ప్రాంగణంలో పొంగళ్లు పెట్టి, అనంతరం కుంభం వేసే కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం గ్రామ వీధుల్లో అమ్మవారిని వైభవంగా ఊరేగించారు. మంగళవాయిద్యాల నడుమ సాగిన ఈ ఊరేగింపులో గ్రామస్తులు ప్రతి ఇంటి ముందర అమ్మవారికి హారతులు పట్టి, ప్రత్యేక పూజలు చేసి భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. అమ్మవారి కృపాకటాక్షాల కోసం గ్రామంలోని ప్రజలందరూ ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాలుపంచుకున్నారు.
ఈ ఆధ్యాత్మిక మహోత్సవానికి స్థానిక ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయన అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలందరిపై అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు సుబ్రహ్మణ్యం రెడ్డి, బుజ్జి నాయుడు, లక్ష్మమ్మ, రామ తులసి, జై చంద్ర, టైగర్ తదితరులు పాల్గొన్నారు. జాతర విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆలయ చైర్మన్ తమ్మిశెట్టి రవీంద్ర, కృష్ణమూర్తిలు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *