కొండాపురం, ఫిబ్రవరి 19,మన న్యూస్,(నాగరాజు కె ).
హెరిటేజ్ ఫుడ్స్ సంస్థను లక్ష్యంగా చేసుకుని సాక్షి మీడియా మరియు వైసీపీ వర్గాలు చేస్తున్న ఆరోపణలు సరైనవి కాదని అందుకే వారు చేస్తున్న దుష్ప్రచారంపై హెరిటేజ్ సంస్థ ఢిల్లీ హైకోర్టులో పరువు నష్టం దావా వేసిందని తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు, మరియు ఉదయగిరి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు తెలిపారు. కొండాపురం మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ,కేసును విచారించిన ఢిల్లీ హైకోర్టు, సంబంధిత ప్రచారాన్ని ఫేక్ ప్రచారం అని గుర్తించినట్లు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వార్తలు, సోషల్ మీడియా పోస్టుల లింకులను 24 గంటల్లోగా తొలగించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు.ఒక ప్రముఖ సంస్థపై ఆధారాలు లేకుండా తప్పుడు ప్రచారం చేయడం సమంజసం కాదని అన్నారు. వైసీపీ నేతలు హెరిటేజ్ ఫుడ్స్ పేరును ఉపయోగించి రాజకీయ లాభం కోసం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడం భావ్యం కాదని విమర్శించారు.సంస్థ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వ్యవహరించడం బాధాకరమని, ఇలాంటి చర్యలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. కోర్టు ఆదేశాలను గౌరవించి వెంటనే సంబంధిత వార్తలు, పోస్టులు తొలగించాలని ఆయన కోరారు.హెరిటేజ్ ఫుడ్స్ వంటి సంస్థలు రైతులతో అనుసంధానంగా పనిచేస్తూ రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తున్నాయని, వాటిపై రాజకీయ ఆరోపణలు చేయడం విచారకరమని బొల్లినేని వెంకట రామారావు తెలియజేశారు. కార్యక్రమంలో టిడిపి మాజీ మండల అధ్యక్షుడు చెరుకూరి వెంకటాద్రి, నెల్లూరు పార్లమెంట్ఎస్సీ సెల్ అధ్యక్షులు కాకి ప్రసాద్, మెట్టుకూరి అమరజీవి, చెరుకూరి నవీన్, చెరుకూరి శేషయ్య, పదర్ల తిమోతీ,పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.