మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండల కేంద్రంలో మహిళల ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరా మహిళా శక్తి పథకం కింద పెరటి కోళ్ల మదర్ యూనిట్ కేంద్రాన్ని ఎంపీడీవో శివకృష్ణ,ఐకేపీ ఏపీఎం ప్రసన్నరాణి లు లబ్ధిదారులకు చేతుల మీదుగా అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు స్వయం ఉపాధి ద్వారా నిలదొక్కుకునేందుకు ఇటువంటి పథకాలు ఎంతో దోహదపడుతున్నాయని తెలిపారు.ప్రభుత్వం అందజేస్తున్న పెరటి కోళ్ల మదర్ యూనిట్లను సద్వినియోగం చేసుకొని కుటుంబ ఆదాయాన్ని పెంచుకోవాలని సూచించారు. కోళ్ల పెంపకం ద్వారా తక్కువ ఖర్చుతో స్థిరమైన ఆదాయం లభిస్తుందని,మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు ఇది మంచి అవకాశమని అన్నారు.
అలాగే మహిళా సంఘాల సభ్యులు ఐకేపీ ద్వారా అందుతున్న శిక్షణను, మార్గదర్శకాలను పూర్తిగా వినియోగించుకోవాలని, యూనిట్ల నిర్వహణలో జాగ్రత్తలు పాటిస్తూ విజయవంతంగా కొనసాగించాలని సూచించారు.ఈ పథకం ద్వారా మహిళలు ఆర్థికంగా బలపడటమే కాకుండా కుటుంబం,సమాజ అభివృద్ధిలో కూడా కీలక పాత్ర పోషించగలరని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఐకెపి సీసీ సాయిలు, సంఘ సభ్యులు తదితరులున్నారు.