

గూడూరు, మన న్యూస్:ఎల్ఏ సాగరం చెరువు పరిసరాల్లో ఉన్న లోతట్టు ప్రాంతాలు ఇప్పుడు రియల్ ఎస్టేట్ దందాలకు అడ్డాగా మారాయి. బఫర్ జోన్లను లెక్కచేయకుండా, చెరువు కట్టలను పరిగణనలోకి తీసుకోకుండా రెవెన్యూ, మున్సిపాలిటీ, తుడా నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా లేఅవుట్లు వెలుసుతున్నాయి.పచ్చని పంట పొలాలు ప్రైవేటు డెవలపర్ల చేతిలో ప్లాట్లుగా రూపాంతరం చెందుతున్నాయి. కన్వర్షన్ లేకుండా, మున్సిపాలిటీ ఆమోదం లేకుండానే ప్లాట్ల విక్రయాలు సాగిపోతున్నాయి. మున్సిపాలిటీకి ఇవ్వాల్సిన పది శాతం ఓపెన్ స్పేస్ను కూడా హాంపట్ చేయడం ద్వారా ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి కొడుతున్నారు.ఈ అక్రమాలకు పాల్పడుతున్న రియల్టర్లు ప్రభుత్వానికి తగినంత పన్నులు చెల్లించకుండా ఆదాయాన్ని దాచేస్తున్నారు. అయితే, మున్సిపాలిటీ, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులు మాత్రం ఈ అక్రమాలను చూసి చూసీ మౌనంగా ఉండటం స్థానికుల్లో అనుమానాలకు తావిస్తోంది.భారీ వర్షాలు వస్తే చెరువు ముంపు ప్రాంతంలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు భద్రంగా ఉండరన్నదే వాస్తవం. అయినా కూడా బఫర్ జోన్లో ప్లాట్లకు అనుమతులు ఎలా వచ్చాయోనన్న ప్రశ్నలు మిగిలిపోతున్నాయి. ప్రభుత్వ ఆదాయానికి కోట్లలో గండి పడుతుండగా, అధికారులు మాత్రం శీతల వైఖరి ప్రదర్శించడంలో ఆంతర్యం ఏమిటన్నది అందరికీ తలపొలికే విషయమవుతోంది.