మన న్యూస్, నెల్లూరు: నెల్లూరులో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా మంగళవారం ముత్తుకూరు రోడ్డు ఆకుతోట గిరిజనకాలనీ నుంచి ఇందిరా భవన్ వరకు ర్యాలీగా వెళ్లారు. గాంధీబొమ్మ సెంటర్ వద్ద వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు షర్మిల. అనంతరం ఇంద్రభవన్లో మీడియాతో మాట్లాడుతూ…… జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావడం అందరికీ అవసరమన్నారు. మాజీ సీఎం జగన్ పర్యటనలో సింగయ్య మృతిపై స్పందించిన షర్మిల.. జగన్ సైడ్ బోర్డు మీద నిలబడి ప్రయాణం చేయడమే తప్పని… జగన్ షేక్ హ్యాండ్ ఇస్తున్న సమయంలోనే సంఘటన జరిగిందన్నారు. ఫేక్ వీడియో అనడం దురదృష్టకరమన్నారు.జగన్ ప్రతీ విషయంలోనూ ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు జనంలోకి వచ్చిన పరిస్థితి లేదని… ఇప్పుడేమో జనసమీకరణతో బలప్రదర్శన చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ‘జగన్‌కు నిబంధనలు, ఆంక్షలు ఉండవు. మూడు బండ్లు అంటే, ముప్పై బండ్లతో వెళతారు. జగన్ మోదీ దత్తపుత్రుడనా? కార్ల కింద మనుషులని నలుపుకుంటూ పోతూ, మానవత్వం గురించి మాట్లాడుతారా? జగన్‌కు అసెంబ్లీకి వెళ్లి సమాధానం చెప్పే దమ్ము లేదు. రుషికొండలని ఎందుకు గుండుగొరిగారు? మద్యపాన నిషేధం చేస్తామని ఎందుకు కుంభకోణానికి పాల్పడ్డారు?’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. కాంగ్రెస్‌ను నిలబెట్టడానికి తన అవసరం ఉందని పంపించారని తెలిపారు. తనకు, జగన్‌కు ఉన్న విభేదాలు, రాష్ట్ర సమస్యలతో పోల్చితే చాలా చిన్నవన్నారు. జగన్ సీఎం అయిన వెంటనే తమకు విభేదాలు వచ్చాయన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఒక్కటే పోరాడగలదని స్పష్టం చేశారు. షర్మిల ఇంకా మాట్లాడుతూ… జగన్, వైఎస్ కుమారుడు అయినా మోదీకి దత్తపుత్రుడిగా ప్రతి బిల్లులోనూ బీజేపీకి మద్దతిచ్చారన్నారు. అదానీ, అంబానీలతో పాటు ఎవరికి ఏ మేలు కావాలన్నా చేశారని.. మెడలు వంచుతానని చెప్పి.. తానే మెడలు వంచారంటూ వ్యాఖ్యలు చేశారు. మన రాష్ట్రానికి ఏ మేలూ చేయని పార్టీ బీజేపీ అని విమర్శించారు. పదిహేనేళ్లుగా ఏపీ ప్రజలను బీజేపీ వెన్నుపోటు పొడుస్తుందన్నారు. ఇప్పుడు పోలవరానికి డబ్బులు ఇస్తామంటున్నారని… అయితే పార్లమెంటులో ఒక్క ఎంపీ కూడా పోలవరం ఎత్తు 45 ఉండాలని ప్రశ్నించే వారేలేరన్నారు. న్యూఢిల్లీని మించిన రాజధానిని నిర్మిస్తామన్నారని తెలిపారు.అన్నదాత సుఖీభవ కింద రైతుకి రూ.20వేలు ఇస్తామని, ఇప్పటికీ ఇవ్వలేదని విమర్శించారు. 80 లక్షల మంది రైతులు ఉంటే, 45 లక్షలకు కుదించారన్నారు. కర్నాటక, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాలు మహిళలకు ఉచిత బస్సు బ్రహ్మాండంగా అమలు చేస్తుంటే, ఏపీలో ఇప్పటికీ అమలు కాలేదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 ఏళ్లకే ఫించను ఇస్తామన్నారని అన్నారు. ‘మిమ్మల్ని ప్రశ్నిస్తున్న మా నాలుకలు మందమా? ప్రజలని మోసం చేస్తున్న మీ నాలుకలు మందమా? వెంటనే అన్ని పథకాలు, హామీలని నెరవేర్చాలని’ వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. కాగా.. గాంధీబొమ్మ సెంటర్ వద్ద వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన షర్మిల.. పక్కనే ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళులర్పించడాన్ని ఏపీసీసీ చీఫ్‌తో పాటు కాంగ్రెస్ నేతలు మరవడం చర్చకు దారి తీసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *