ఆంధ్రప్రదేశ్, సెప్టెంబర్ 17మన న్యూస్ ప్రతినిధి నాగరాజు.
నివాస ధ్రువీకరణపత్రాల జారీ అధికారాన్ని తహసీల్దార్లకు పునరుద్ధరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ పత్రం కావాలంటే ఆధారాలతో దరఖాస్తుల్ని తహసీల్దారుకు సమర్పించాలని, ఎలాంటి ఆధారాలు లేకపోతే తహసీల్దారు స్థానికంగా విచారణ చేసి నివాసాన్ని ధ్రువీకరించి పత్రం జారీచేయాలని సీఎస్, రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆధార్, రేషన్ కార్డులను నివాస రుజువులుగా ఉపయోగించాలని ప్రభుత్వం 2015 జూన్ 20న ఉత్తర్వులు ఇచ్చింది. తహసీల్దార్ల ద్వారా నివాస ధ్రువీకరణపత్రాల జారీని నిలిపేసింది. విద్య, ఉద్యోగాలు, ఓటరు జాబితాలో పేరు నమోదుకు స్థానిక గుర్తింపు కోసం ప్రజలు నివాస ధ్రువీకరణ పత్రాల్ని కోరుతున్నారు. దీన్ని పరిశీలించిన ప్రభుత్వం 2015 జూన్ 20న ఇచ్చిన జీవోను రద్దుచేసింది. తహసీల్దార్ల ద్వారా నివాస ధ్రువీకరణ పత్రాల జారీని పునరుద్ధరించింది.