పారదర్శకంగా ఓటర్ల జాబితా సవరణ..
ఎంపీడీవో రవిచంద్ర ఆధ్వర్యంలో సమీక్ష.
రేణిగుంట ఆగష్టు 28.
తిరుపతి జిల్లా రేణిగుంట మండల ప్రజా పరిషత్ (ఎంపీడీవో) కార్యాలయంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (సర్ – 2026) విచారణ ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది. ఎంపీడీవో రవిచంద్ర మరియు హౌసింగ్ ఏఈ ఆధ్వర్యంలో ఈ వెరిఫికేషన్ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహిస్తున్నారు. కార్యాలయంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ సిబ్బంది తగిన జాగ్రత్తలు వహిస్తూ బందోబస్తు పర్యవేక్షిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ, వార్డు సచివాలయ బిఎల్ఓలు, మండల ఎన్నికల విభాగపు సిబ్బంది పాల్గొని విధులు నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా ఎంపీడీవో రవిచంద్ర మాట్లాడుతూ, ఓటరు జాబితాలో ఎటువంటి లోపాలు లేకుండా పారదర్శకంగా రూపకల్పన చేయాలని తెలిపారు. మరణించిన వారి పేర్ల తొలగింపు, డూప్లికేట్ ఓట్ల గుర్తింపుతో పాటు పేరు, వయస్సు, ఇంటిపేరు వంటి వివరాల్లో వ్యత్యాసాలు ఉన్న ‘అనమలీస్’ మరియు ‘మిస్మ్యాచింగ్’ కేసులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సరైన రీతిలో ఓటు హక్కు కల్పించేలా సవరణల దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని ఆయన తెలిపారు.

