రేణిగుంట (ఆగస్టు 25):
సామాజిక న్యాయ పోరాట సమరయోధుడు, బీసీల పితామహుడు బి.పి. మండల్ 108వ జయంతి వేడుకలను రేణిగుంటలో బహుజన సమాజ్ నాయకులు, ప్రజాసంఘాలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బి.పి. మండల్ విగ్రహానికి జాతీయ బీసీ నాయకులు పూల వెంకటాద్రి యాదవ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పూల వెంకటాద్రి యాదవ్ మాట్లాడుతూ బీసీ సామాజిక వర్గాల అభ్యున్నతికి, హక్కుల పరిరక్షణకు బి.పి. మండల్ చేసిన సేవలు అజరామరమని, ఆయన సేవలు ఎల్లప్పుడూ చిరస్మరణీయంగా ఉంటాయని కొనియాడారు. రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్లు బీసీల హక్కు అని, అనేక దశాబ్దాలుగా వెనుకబడిన బీసీలను రాజకీయంగా బలోపేతం చేసి, 2029 ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో బీసీల రాజ్యాధికారమే లక్ష్యంగా దివ్యంగా పనిచేస్తామని స్పష్టం చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ బీసీ కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసినప్పటికీ, వాటికి ఒక్క రూపాయి కూడా నిధులు కేటాయించకపోవడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేస్తూ, ప్రభుత్వం తక్షణమే కార్పొరేషన్ నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయాలు బీసీల వెన్నుముకగానే నడుస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి మధు, నాయకులు సమాధి చిరంజీవి, భాస్కర్, వడ్డే రామయ్య, శాకం ప్రభాకర్, కట్టమంచి చంద్రబాబు యాదవ్ తదితర బహుజన, బీసీ నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
