మన ధ్యాస ,నిజాంసాగర్: ( జుక్కల్ )విద్యార్థులు కష్టపడి చదివి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కామారెడ్డి జిల్లా డీసీసీఅధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ అన్నారు.నిజాంసాగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఆయన పాఠ్యపుస్తకాలను డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..విద్యే జీవితాన్ని తీర్చిదిద్దే గొప్ప ఆయుధమని, విద్యార్థులు ప్రభుత్వం అందిస్తున్న పాఠ్యపుస్తకాలు, ఇతర సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని కష్టపడి చదవాలని సూచించారు. ప్రతి విద్యార్థి స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని సమయపాలన పాటిస్తూ పట్టుదలతో చదివితే ఉన్నత స్థానాలకు చేరుకోవడం సాధ్యమవుతుందన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆశయాలకు అనుగుణంగా చదువులో ప్రతిభ కనబరిచి కళాశాల, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు.ఉపాధ్యాయులు విద్యార్థులకు పాఠ్యాంశాలు సులభంగా అర్థమయ్యే విధంగా బోధిస్తూ, వారి ప్రతిభను వెలికితీసేలా ప్రోత్సహించాలని సూచించారు. విద్యార్థుల్లో క్రమశిక్షణ, నైతిక విలువలు, సామాజిక బాధ్యత పెంపొందేలా కృషి చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి మంద బలరాం, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ప్రజా పండరి, నాయకులు బంగ్లా ప్రవీణ్ కుమార్, గాండ్ల రమేష్, చాకలి సాయిలు, పంచాయతీ కార్యదర్శి భీమ్రావు, కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.