

మన న్యూస్ శ్రీకాళహస్తి, డిసెంబర్ 13:
తిరుపతి నుండి అయోధ్యకు వచ్చే ఏడాది మార్చి నెల చివరిలో శ్రీరామరథయాత్రను రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన్ ( ఆర్ హెచ్ వి ఎస్ ) నిర్వహించనున్నది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి యోగి ఆదిత్యనాథ్ లతోపాటు దేశ విదేశాలకు చెందిన ప్రముఖులు హాజరు కానున్నారు. ఈ మేరకు సన్నాహక కార్యక్రమాలు రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన జాతీయ కన్వీనర్ వైదేహి వల్లభ శరన్ మహారాజ్, జాతీయ అధ్యక్ష కార్యదర్శులు రమేష్ చంద్ర ద్వివేది ( రాజు భయ్యా ), నవీన్ చంద్ర శుక్ల, కృష్ణ కిషోర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార ప్రతినిధి, రాష్ట్ర ఉపాధ్యక్షులు గుండ్రాజు సుకుమార్ రాజుల ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బి వి సుధీర్ రెడ్డిని శుక్రవారం ఉదయం ఆయన నివాసంలో రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన అధికార ప్రతినిధి సుకుమార్ రాజు మర్యాదపూర్వకంగా కలిసి శ్రీరామ రథయాత్రకు రావలసిందిగా ఆహ్వానించారు. దీనికి ఆయన స్పందించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకుని తప్పకుండా శ్రీరామ రథయాత్రకు వస్తానని చెప్పడం ఆనందంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. ఏమ్మెల్యే బి వి సుధీర్ రెడ్ది మాట్లాడుతూ హిందూ సామ్రాజ్యంలో రామ రాజ్య స్థాపన కోసం, హిందూ భావజాలాలతో పాటు ఆధ్యాత్మికత, సనాతన ధర్మాలను క్షేత్రస్థాయిలో ప్రతి గడపకు చేరే విధంగా కార్యక్రమాలను రూపొందించడం అభినందనీయమన్నారు. తిరుపతి నుండి అయోధ్యకు సాగే శ్రీరామ రథయాత్ర ముగిసిన తరువాత కన్యాకుమారి నుంచి కాశ్మీరం వరకు రెండవ దపా శ్రీరామ రథయాత్ర ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన ఆంధ్రప్రదేశ్ అధికార ప్రతినిధి సుకుమార్ రాజు తెలిపారు.