చీకటి నుంచి వెలుగులోకి గాంధీ విగ్రహం – శ్రీకాళహస్తి మైనారిటీ అధ్యక్షుని షేక్ అఫ్రోజ్ చొరవ….
రేణిగుంట:
తిరుపతి జిల్లా రేణిగుంట బస్టాండ్ కూడలి వద్ద ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం పట్ల స్థానిక నాయకులు చూపిన చొరవ ప్రజల మన్ననలు పొందుతోంది. బస్టాండ్ వద్ద ఉన్న గాంధీ మంటపంలో లైట్లు లేకపోవడం వల్ల విగ్రహం చీకటిలో ఉండటం, అలాగే విగ్రహానికి ఉండాల్సిన కళ్ళజోడు సరిగా లేకపోవడాన్ని గమనించి శ్రీకాళహస్తి నియోజకవర్గ మైనారిటీ అధ్యక్షులు షేక్ అఫ్రోజ్ ఆవేదన వ్యక్తం చేశారు.
జాతిపిత పట్ల గౌరవంతో ఆయన తక్షణమే స్పందించి, మంటపానికి నూతనంగా విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయించారు. అంతేకాకుండా, విగ్రహానికి కొత్త కళ్ళజోడును కూడా అమర్చి విగ్రహాన్ని పునరుద్ధరించారు.
”గాంధీ విగ్రహం చీకటిలో ఉండటం చూసి మనసు కలిచివేసింది. వెంటనే స్పందించి లైట్లు, కళ్ళజోడు ఏర్పాటు చేయడం వల్ల ఇప్పుడు మనసుకి చాలా సంతృప్తిగా ఉంది,” అని షేక్ అఫ్రోజ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
మహనీయుల విగ్రహాలను గౌరవప్రదంగా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానికులు కూడా పాల్గొని అఫ్రోజ్ చేసిన సేవను అభినందించారు.
