గోవింద నామస్మరణల మధ్య దివ్య దర్శనానందం
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో జరుగుతున్న వసంతోత్సవాల్లో భాగంగా రెండవ రోజు శుక్రవారం ఉదయం స్వర్ణరథోత్సవం భక్తి వైభవంతో అద్భుతంగా జరిగింది. సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారు స్వర్ణరథంపై ఆశీనురాలై భక్తులకు దివ్య కటాక్షం ప్రసాదించారు.
ఆలయంలో వైదిక కార్యక్రమాల అనంతరం అర్చకులు అమ్మవారి ఉత్సవమూర్తిని శాస్త్రోక్తంగా స్వర్ణరథంపై ప్రతిష్ఠించారు. అనంతరం నాలుగు మాడ వీధుల్లో స్వర్ణరథం సంచరించగా, భక్తుల గోవింద నామస్మరణలతో ఆ ప్రాంతం ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది.
ప్రత్యేకంగా మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని అపార భక్తిశ్రద్ధలతో రథాన్ని లాగడం విశేష ఆకర్షణగా నిలిచింది. కర్పూర హారతులు సమర్పిస్తూ అమ్మవారి దివ్య దర్శనంతో భక్తులు ఆధ్యాత్మికానందంలో మునిగిపోయారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో హరేంద్రనాథ్, ఎస్ ఈ శ నరసింహ మూర్తి, ఏఈఓ దేవరాజులు, అర్చకులు బాబుస్వామి, సూపరింటెండెంట్ చెంగల్ రాయులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ చలపతి తదితర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
