మన న్యూస్: కడప జిల్లా: బద్వేల్: ఏప్రిల్ 13: పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు తోడు గ్యాస్ సిలెండర్ రేట్లు పెంచడం అమానుషమని, ధరల పెంపుతో పేద సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్న కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల పోరాటాలకు ప్రజలు సిద్ధం కావాలని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి బందెల ఓబయ్య పిలుపునిచ్చారు. శనివారం ఉదయం బద్వేల్ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం తన ఎన్నికల ప్రచారంలో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే నిత్యావసర వస్తువులు ధరలను తగ్గించి సామాన్యులకు అందుబాటులోకి తెస్తామని వాగ్దానం ఇచ్చి నేడు మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా నేడు గ్యాస్ సిలిండర్ పై 50 రూపాయలు పెంచి సామాన్యుడి వంటింట్లో గ్యాస్ ధరల మంటలు పుట్టిస్తున్నారని వారు విమర్శించారు. గత కొన్ని రోజులుగా వాణిజ్య సిలెండర్ ధరలను పెంచుతూ వస్తున్న ప్రభుత్వం తాజాగా గృహ వినియోగ వంట గ్యాస్ ధరను కేంద్రం రూ 50 పెంచి పేద,సామాన్య ప్రజల నడ్డి విరచడం దుర్మార్గమని, ఉజ్వల్ యోజన పథకం క్రింద అందచేసే సిలెండర్ పై కూడా రూ 50 భారాన్ని మోపడం సామాన్య, మధ్య తరగతి ప్రజలకు గ్యాస్ దూరం చేయడమేనని, ఈ పెంపుతో 14.2 కేజీల ఎల్ పి జి గ్యాస్ సిలెండర్ ధర రూ 853 నుంచి రూ 903కు చేరిందని, ఇప్పటికే కూరగాయల ధరల నుంచి కిరాణా సరుకుల వరకు ధరలు విపరీతంగా పెరిగి సామాన్య ప్రజలు కొనలేని పరిస్థితిని ఎదుర్కొంటుంటే ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు పెరిగిన నిత్యవసర వస్తువుల ధరలను అరికట్టి సామాన్య ప్రజలకు అందుబాటులో తేకుండా మరింత భారాలను మోపడం దుర్మార్గమని వారన్నారు. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్లో భాగంగా ప్రవేశపెట్టిన దీపం-2 పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు చాలామందికి అందడం లేదన్నారు. ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా అందజేయనున్నట్టు ప్రకటించారని, ముందుగా వినియోగదారులు సిలిండర్ ధర ఏజెన్సీలకు చెల్లించాలని, రెండు రోజుల్లో ఆ డబ్బులు మొత్తం సబ్సిడీ కింద వినియోగదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారని,కానీ నేటికీ తొలివిడత కింద ఇప్పటివరకూ ముప్పై, నలభై శాతం మందికి సిలిండర్ రాయితీ డబ్బులు వారి ఖాతాకు జమ కాలేదని దీనికి అనేక కారణాలు చెప్తున్నారని ఎవరిని అడగాలో తెలియని పరిస్థితులు లబ్ధిదారులు అయోమయంలో ఉన్నారని ఇది ప్రభుత్వ లోపం కాదా అని వారు ప్రశ్నించారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం తాము ఇచ్చిన హామీల ప్రకారం తక్షణమే నిత్యావసర వస్తువుల ధరలను అదుపు చేసి పెంచిన గ్యాస్ ధరలను వెంటనే ఉపసంహరించుకొని, లోపాలను సవరించి మొదటి ఉచిత సిలిండర్ డబ్బులు జమ కాని వినియోగదారులకు డబ్బులు జమ చేసేలా చర్యలు తీసుకొని ప్రజలకు ఇచ్చిన హామీల నిలబెట్టుకోవాలని లేనిపక్షంలో ప్రజాగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని వారు హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం వైఫల్యాలపై సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ చేపట్టబోవు ప్రజా ఉద్యమాలలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని వారు పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు చంద్రమోహన్ రాజు, జకరయ్య, మరియు నియోజకవర్గ నాయకులు సంజీవ రాయుడు,విజయ రావు, కే బాబు, చంద్రపాల్, జైపాల్, రమణ తదితరులు పాల్గొన్నారు.