

మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం:స్టెమి ఇంజక్షన్తో గుండెపోటుతో ఉన్న వ్యక్తికి ఒక గంటలో ప్రాణాన్ని సంరక్షించే అవకాశం ఉందని, ఈ విషయంపై విస్తృతంగా ప్రచారం చేయాలని ఏలేశ్వరం సామాజిక ఆరోగ్య కేంద్రం లో హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ శైలజ చెప్పారు. సోమవారం ఏలేశ్వరం సామాజిక ఆరోగ్య కేంద్రంలో స్టెమీతో గుండెకు భరోసా కార్యక్రమంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ శైలజ మాట్లాడుతూ మొదటి గంటలోపు చాతి నొప్పి, ఎడం భుజం లాగడం, ఆకస్మిక ఆయాసం, గుండెదడ, స్పృహ కోల్పోవడం వంటి సమస్యలతో పేషెంట్లు ఆసుపత్రికి రాగానే ప్రాథమిక పరీక్షలు నిర్వహించి, మొదటి గంటలోనే రూ.45 వేలు విలువైన టినెక్టి ప్లస్ ఇంజక్షన్ ఉచితంగా ఇవ్వడం ద్వారా ప్రాణాన్ని కాపాడవచ్చునని అన్నారు. అటువంటి సమస్యలు ఉన్నవారు ఆసుపత్రికి రాగానే ఇసిజి తీసి కాకినాడలో ఉన్న జిజిహెచ్ హబ్ వెంటనే రిపోర్టులు మెయిల్ ద్వారా పంపించి, వారి సూచనలు తీసుకుని వెనువెంటనే టినెక్టి ప్లస్ ఇంజక్షన్ పేషెంట్కు అందించడం ద్వారా గంటలోగా ప్రాణాలు రక్షించడం జరుగుతుందన్నారు. ఈ వైద్య విధానంపై ఆసుపత్రి పరిధిలో గల ప్రజలకు విరివిగా ప్రచారం నిర్వహించి గుండె జబ్బు నుంచి సంరక్షించుకునేలా చూడాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో హాస్పటల్ డాక్టర్ ఎన్ రాఘుపతి,డాక్టర్ కె లావణ్య, డాక్టర్ సిహెచ్. డి స్రవంతి, డాక్టర్ వి.రమేష్, హాస్పటల్ సిబ్బంది పాల్గొన్నారు
పాల్గొన్నారు. స్టెమి ఇంజక్షన్ గుండెకు భరోసా అనే పోస్టర్ను ఆవిష్కరించారు.