మన ధ్యాస, కందుకూరు, జూలై 3: నెల్లూరు జిల్లా, కందుకూరులోని సబ్ కలెక్టర్ కార్యాలయం ఆవరణలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక పిజిఆర్ఎస్ కార్యక్రమం శుక్రవారం జరిగింది. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలు తరలివచ్చి తమ సమస్యలపై అర్జీలు ఇచ్చారు. జాయింట్ కలెక్టర్ కల్పనాకుమారి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, సబ్ కలెక్టర్ దామెర హిమవంశీ ,147 అర్జీలు స్వీకరించి సమస్యలను విన్నారు.కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ……… లింగసముద్రంలో ఇటీవల కలెక్టర్ ఆధ్వర్యంలో గ్రీవెన్స్ నిర్వహిస్తే, 90 శాతం అర్జీలు రెవిన్యూ సమస్యలపై వచ్చాయి. నియోజకవర్గంలోని అనేక గ్రామాల్లో ఇలాంటి పరిస్థితి ఉంది. పట్టా భూములు, అసైన్డ్ భూములు అన్న తేడా లేకుండా ఆన్లైన్ లో అక్రమాలకు పాల్పడ్డారు. క్రింది స్థాయి రెవిన్యూ సిబ్బంది ఇష్టం వచ్చినట్లు తప్పులు చేశారు. రికార్డులు మొత్తం తారుమారు చేశారు, కొన్నిచోట్ల వాటిని మాయం చేసారు కూడా అని అన్నారు.రెవెన్యూ సిబ్బంది చేసిన తప్పులకు రైతులు ఏళ్ల తరబడి ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న తమ భూములు… ఆన్లైన్ లో వేరొకరి పేరుమీద ఉంటే, ఆ రైతుల ఆవేదన ఎలా ఉంటుందో ఆలోచించండి… బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదు అని అన్నారు.అధికారుల నిర్లక్ష్యానికి నాకు కోపం, బాధ రెండూ వస్తున్నాయి. ఎన్నిసార్లు చెప్పినా కొంతమంది అధికారుల తీరులో మార్పు రావడం లేదు… ఆ తప్పులన్నీ సరిచేయాల్సిన బాధ్యత అధికారులపై ఉంది అని అన్నారు. గ్రౌండ్ లెవెల్ అధికారులు, వారి చేతుల్లో ఉన్నంతలో సమస్యలను పరిష్కరించండి. రైతులను పదేపదే తిప్పుకోవద్దు. అని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు సూచించారు. నియోజకవర్గంలో రెవెన్యూ సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి కి ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.



