రేణిగుంట జూన్ 19.
తిరుపతి జిల్లా రేణిగుంట మండలం, గాజులమన్యం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎలమండ్యం హరిజనవాడ గ్రామంలో ‘పల్లె నిద్ర’ కార్యక్రమం పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో అత్యంత విజయవంతంగా జరిగింది. గాజులమన్యం సిఐ మంజునాథ్ రెడ్డి నేతృత్వంలో పోలీస్ సిబ్బంది గ్రామంలో పర్యటించి, స్థానిక ప్రజలతో మమేకమై మహిళల భద్రత కోసం ప్రభుత్వం మరియు పోలీస్ శాఖ తీసుకువచ్చిన ‘శక్తి యాప్’ ప్రాధాన్యతను వివరించారు. ప్రతి మహిళా, యువతి తమ మొబైల్ ఫోన్లలో ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని, ఆపద సమయంలో ఈ యాప్ ద్వారా పోలీసులకు సమాచారం అందిస్తే క్షణాల వ్యవధిలో రక్షణ లభిస్తుందని నొక్కి చెప్పారు. అలాగే ప్రస్తుత డిజిటల్ యుగంలో పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తూ, బ్యాంక్ ఓటిపి లు, పిన్ నంబర్లను ఎవరికీ చెప్పకూడదని, లాటరీలు, నకిలీ లోన్ యాప్ల లింకులను క్లిక్ చేసి మోసపోవద్దని, ఒకవేళ ఎవరైనా సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్కు ఫిర్యాదు చేయాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పిలుపునిస్తూ, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని తల్లిదండ్రులకు స్పష్టం చేస్తూ అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రాణాంతకమని హెచ్చరించారు. పోలీసులే స్వయంగా తమ గ్రామానికి వచ్చి రాత్రి వేళల్లో ‘పల్లె నిద్ర’ చేస్తూ శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ఇలాంటి సామాజిక అంశాలపై అవగాహన కల్పించడం పట్ల ఎలమండ్యం గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేసిన ఈ కార్యక్రమంలో గాజులమన్యం పోలీస్ స్టేషన్ ఎస్సైలు, పోలీస్ సిబ్బంది, మరియు గ్రామానికి చెందిన మహిళలు, యువకులు, పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

