మన ధ్యాస,నిజాంసాగర్, ( జుక్కల్ ): నిజాంసాగర్ ప్రాజెక్టు జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో రూ.12 కోట్ల వ్యయంతో చేపడుతున్న అభివృద్ధి పనులను వర్షాకాలానికి ముందే పూర్తి చేయాలని తెలంగాణ రాష్ట్ర హైడ్రాల్ డైరెక్టర్ బాలరాజ్ అధికారులను ఆదేశించారు.
కామారెడ్డి జిల్లా మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్ పల్లి గ్రామపంచాయతీ శివారులో ఉన్న హెడ్ స్లూయిస్ నిజాంసాగర్ ప్రాజెక్టు జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఆయన శుక్రవారం సందర్శించారు.కేంద్రంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి,పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా అత్యాధునిక జర్మన్ సాంకేతికతతో ఏర్పాటు చేస్తున్న కొత్త టర్బైన్లు,జనరేటర్ల పనులను పరిశీలించారు.నిర్మాణ పనుల నాణ్యత,ప్రస్తుత పరిస్థితులు, పనుల పురోగతిపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.అనంతరం బాలరాజ్ మాట్లాడుతూ..పనుల నిర్వహణలో నాణ్యతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని సూచించారు.

వర్షాకాలం ప్రారంభం కాకముందే పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేసి, ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా జలవిద్యుత్ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఎస్ సి శ్రీనివాస్,డీఈ శ్రీనివాస్ నాయక్, గంగాధర్,ఏడీ రవికుమార్,ఏఈలు నిహంత్ రెడ్డి,కిషన్,తదితరులు ఉన్నారు.

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *