తిరుపతి/మే 31:

2013 బ్యాచ్‌కు చెందిన భారతీయ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ అధికారి వై. బాలాజీ కిరణ్ దక్షిణ కోస్తా రైల్వే ప్రధాన ప్రజా సంబంధాల అధికారి గా అదనపు బాధ్యతలు స్వీకరించారు.

బాలాజీ కిరణ్ నవంబర్ 2025 నుంచి దక్షిణ కోస్తా రైల్వేలో డిప్యూటీ జనరల్ మేనేజర్-కమ్-సెక్రటరీ టు జనరల్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. భారతీయ రైల్వేల్లో ట్రాఫిక్, కమర్షియల్ విభాగాల్లో విశేష అనుభవం కలిగిన ఆయన గుంతకల్ డివిజన్‌లో సీనియర్ డివిజనల్ ఆపరేషన్స్ మేనేజర్‌గా, సికింద్రాబాద్ మరియు హైదరాబాద్ డివిజన్లలో సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్‌గా కీలక బాధ్యతలు నిర్వర్తించారు.

నాయుడుపేట కి చెందిన బాలాజీ కిరణ్, శ్రీ కళహస్తీశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (స్కిట్ )లో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌లో బీటెక్ పట్టా పొందారు. అనంతరం ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ పూర్తి చేయడంతో పాటు, పొలిటికల్ సైన్స్ మరియు ఇండస్ట్రియల్ రిలేషన్స్‌లో మాస్టర్స్ డిగ్రీలను కూడా సాధించారు.

ఆంధ్రప్రదేశ్‌లోని నాయుడుపేటకు చెందిన ఆయన సామాజిక సేవా కార్యక్రమాలు, యువత అభివృద్ధి పట్ల ప్రత్యేక ఆసక్తి కలిగిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. నాయుడుపేటలో “ఆశయ” అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి, పలు సామాజిక సంక్షేమ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. సివిల్ సర్వీసుల్లో చేరకముందు సింగపూర్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేశారు. అలాగే ఢిల్లీలోని శ్రీ చైతన్య ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్‌గా సేవలందిస్తూ, అనేక మంది సివిల్ సర్వీసెస్ అభ్యర్థులకు మార్గదర్శకత్వం వహించారు.

తన విస్తృత పరిపాలనా అనుభవం, వృత్తిపరమైన నైపుణ్యం, సమర్థమైన కమ్యూనికేషన్ సామర్థ్యాలతో వై. బాలాజీ కిరణ్ దక్షిణ కోస్తా రైల్వే ప్రజా సంబంధాలు, మీడియా అనుసంధాన కార్యక్రమాలను మరింత బలోపేతం చేస్తారని రైల్వే వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *