వరికుంటపాడు, జనవరి 25,మన ధ్యాస న్యూస్.(నాగరాజు కె).

నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం తూర్పు రొంపిదొడ్లలో ఆదివారం విషాద ఘటన చోటుచేసుకుంది. బోణిగాలరావుపాడు పరిధిలో కంది చేను చుట్టూ అక్రమంగా విద్యుత్ ప్రవాహం ఏర్పాటు చేయడంతో ఇద్దరు యువకులు విద్యుత్‌ఘాతానికి బలయ్యారు.పొలం వెంబడి దారి ఉండటంతో ద్విచక్ర వాహనంపై అటుగా వెళ్తున్న సమయంలో విద్యుత్ తీగ తగిలి షాక్‌కు గురయ్యారని స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో మేకల గణేష్‌ (18), తలపుల రమేష్ తూర్పు రొంపిదొడ్ల ఎస్టీ కాలనీ వాసులుగా గుర్తించారు. విద్యుత్ షాక్ తీవ్రతతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందగా, వారి బైకు పూర్తిగా దగ్ధమైందని సమాచారం.సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. అక్రమంగా విద్యుత్ ఏర్పాటు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. మృతుల కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *