🔸సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ అవగాహన కార్యక్రమంలో ఎమ్మెల్యే కాకర్ల..!

కలిగిరి అక్టోబర్ 1 :(మన ధ్యాస న్యూస్)://///

కలిగిరి మండలం చిన్న అన్నలూరు పంచాయతీ తోగురువారిపాలెం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఎమ్మెల్యే కాకర్ల సురేష్ లబ్ధిదారులకు స్వయంగా అందజేశారు.తరువాత అదే గ్రామంలో సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ – ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రవేశపెట్టిన సూపర్ జీఎస్టీ సంస్కరణలు దేశవ్యాప్తంగా ప్రజలకు నేరుగా లబ్ధి చేకూర్చుతున్నాయని, ఆ లబ్ధిని రాష్ట్ర ప్రభుత్వం కూడా సత్వరమే ప్రజలకు అందిస్తున్నదని తెలిపారు.ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ – షుగర్, బీపీ, కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న రోగుల కోసం అవసరమయ్యే మందులపై జీఎస్టీ శాతం తగ్గించడంతో, ధరలు భారీగా తగ్గి పేద మరియు మధ్య తరగతి ప్రజలకు ఉపశమనం కలిగిందని చెప్పారు. ఆరోగ్య సంరక్షణ రంగంలో ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయం అని అభివర్ణించారు. రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వివరించిన ఎమ్మెల్యే – గతంలో వ్యవసాయ యంత్రాలు, పరికరాలు, ట్రాక్టర్లు మొదలైన వాటిపై 18% జీఎస్టీ ఉండగా, ఇప్పుడు దాన్ని 5%కి తగ్గించడంతో రైతులకు నేరుగా లక్షల రూపాయల ప్రయోజనం కలుగుతోందని తెలిపారు. ఈ విధంగా వ్యవసాయ రంగానికి పెద్ద మేలు జరుగుతోందని అన్నారు.

జీఎస్టీ తగ్గింపుల వలన రాష్ట్ర ప్రభుత్వానికి సంవత్సరానికి సుమారు ₹8,000 కోట్లు నష్టం వాటిల్లుతున్నప్పటికీ, ప్రజల శ్రేయస్సు కోసం రాష్ట్ర ప్రభుత్వం వాటిని భరించడానికి సిద్ధమైందని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈ సంస్కరణలను ఎటువంటి ఆలస్యం లేకుండా నేరుగా అమలు పరుస్తున్నామని, అందుకే రాష్ట్ర ప్రజలు ఆయనకు రుణపడి ఉన్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అలాగే ఎంఎస్‌ఎంఈలు, ఆక్వా రంగం, భవన నిర్మాణం, టూరిజం, లాజిస్టిక్స్, ఎలక్ట్రానిక్స్, ఈ-కామర్స్, బీమా రంగం, విద్యుత్, ఆటోమొబైల్ వంటి అనేక రంగాలపై కూడా జీఎస్టీ శాతం తగ్గించడం వలన ప్రజలకు, వ్యాపారులకు, పరిశ్రమలకు ఒకే సారి ప్రయోజనం కలుగుతోందని వివరించారు. అంతిమంగా, ఈ సంస్కరణల వలన ఏర్పడిన సూపర్ సేవింగ్స్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, తమ కుటుంబాల ఆర్థిక స్థిరత్వాన్ని పెంపొందించుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *