రేణిగుంట, జూలై 10:
సినిమా ఫక్కీలో రేణిగుంట పోలీసులు జూద స్థావరంపై మెరుపు దాడి చేసి, జూదరుల ఆట కట్టించారు. గుత్తివారిపల్లి హరిజనవాడ సమీపంలోని ఓ చెట్టు కింద సీక్రెట్గా సాగుతున్న “మంగతాయి” జూద స్థావరంపై రేణిగుంట అర్బన్ సిఐ ఎస్. జయచంద్ర పర్యవేక్షణలో సబ్-ఇన్స్పెక్టర్ వై. శ్రీనివాసులు బృందం ఆకస్మికంగా విరుచుకుపడింది.
ఈ దాడిలో రేణిగుంట పరిసర ప్రాంతాలకు చెందిన 11 మంది జూదగాళ్లను పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. వారి వద్ద నుండి రూ. 10,120/- ల నగదును, 52 పేకముక్కలను స్వాధీనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా రేణిగుంట అర్బన్ సిఐ జయచంద్ర మాట్లాడుతూ.. ఇలాంటి చట్టవిరుద్ధమైన అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారైనా సరే ఊపేక్షించేది లేదని, కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఎక్కడైనా జూదం, ఇతర అసాంఘిక పనులు జరుగుతుంటే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్కు గానీ లేదా డయల్-112 కి గానీ సమాచారం ఇచ్చి పోలీసులకు సహకరించాలని ప్రజలను కోరారు.
