తిరుపతి జూన్ 25.
తిరుమలలో వివాహం ముగించుకుని బెంగళూరు వెళ్తూ, అలిపిరి సమీపంలోని గరుడాద్రి హోటల్లో భోజనం చేసిన భరత్ కుమార్ కుటుంబం రూ.45 లక్షల విలువైన 300 గ్రాముల బంగారు ఆభరణాల హ్యాండ్ బ్యాగ్ను అక్కడే మరిచిపోయింది. బెంగళూరు వెళ్ళాక విషయం గుర్తించిన బాధితుడు వెంటనే డయల్-112కు సమాచారం అందించారు.
పోలీసులు హోటల్ వద్దకు వెళ్లి విచారించగా, అక్కడ క్యాషియర్గా పనిచేస్తున్న శశి ఆ బ్యాగ్ను భద్రపరిచినట్లు తెలిసింది. ఎటువంటి ప్రలోభాలకు లోనుకాకుండా ఆమె నగలను పోలీసుల సమక్షంలో యజమానికి అప్పగించారు. సకాలంలో స్పందించిన పోలీసులకు, క్యాషియర్ శశికి బాధితుడు కృతజ్ఞతలు తెలిపారు.
క్యాషియర్ శశి నిజాయితీని, నైతిక విలువలను తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., ప్రత్యేకంగా కొనియాడారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఆమెను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఏ శ్రీనివాసులు, చంద్రగిరి డిఎస్పి ప్రసాద్, సిఐ మద్దయ్యాచారి పాల్గొన్నారు
