

- ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ
శంఖవరం అన్నవరం మన న్యూస్ (అపురూప్) :-
వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లు, అమ్మకాల నిర్వహణ, నియంత్రణ వంటి విధి నిర్వహణకు ప్రభుత్వం ద్వారా ఏర్పాటు అయిన వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ యార్డు కమిటీ నూతన పాలృవర్గం బృందం రైతులకు మేలైన, మెరుగైన సేవలను అందించాలని ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ పిలుపును ఇచ్చారు. రైతులకు నాణ్యమైన సేవలను అందించడమే గాక ఇతర సమస్యలను కూడా పరిష్కరించడమే ప్రధాన ధ్యేయంగా ప్రత్తిపాడు వ్యవసాయ మార్కెట్ యార్డు కమిటీ సభ్యులు పని చేయాలని ఎమ్మెల్యే సత్యప్రభ ఆదేశించారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు వ్యవసాయ మార్కెట్ యార్డు కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారాన్ని సత్యప్రభ ఆధ్వర్యంలో శంఖవరం మండలం అన్నవరంలోని హరిహర రిసార్ట్స్ లో ఆదివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ముందుగా నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేసింది. అగ్రికల్చరల్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గా శంఖవరం మండల తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బద్ది రామారావు సతీమణి బద్ది మణి ఛైర్మెన్ గానూ, వైస్ చైర్మన్ గా ప్రత్తిపాడు మండలం వమ్మంగి గ్రామానికి చెందిన సుంకర సోమరాజు తోపాటు నియోజక వర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన 15 మంది పాలకవర్గ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ ప్రత్తిపాడు మార్కెట్ యార్డుకు ఒక ప్రత్యేకత తీసుకొచ్చే విధంగా పనిచేయాలని పాలకవర్గ సభ్యులకు ఆమె పిలుపు నిచ్చారు. మార్కెట్ యార్డుకు త్వరలో ఒక శాశ్వత భవనమును నిర్మించాలనే ఆలోచనలో ఉన్నామని ఆమె అన్నారు. మార్కెట్ కమిటీలో మహిళలకు, బీసీలకు, ఎస్సీ, ఎస్టీలకు పెద్ద పీట వేసామన్నారు, జనసేన, భారతీయ జనతా పార్టీలకు తగిన ప్రాతినిధ్యం ఇచ్చి గౌరవం ఇచ్చాము అన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రైతుల ప్రభుత్వమని, రైతుల కోసం వ్యవసాయ రంగంలో సాంకేతికతను తీసుకొచ్చిన ఘనత మన ప్రియతమ నేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి దక్కుతుందని అన్నారు. వ్యవసాయరంగంలో డ్రోన్లు, పవర్ టిల్లర్స్, రోటో వేటర్స్, స్ప్రేయర్ల తోపాటు రాతీపై విత్తనాలను సైతం చంద్రబాబు ప్రభుత్వం అందజేస్తోంది అన్నారు. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు రూ. 20,000 చొప్పున రైతుల బ్యాంకు ఖాతాల్లో త్వరలోనే జమచేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, ఎన్డీఏ కూటమి శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరు అయ్యారు.