రేణిగుంట ఆగష్టు 22.
తిరుపతి జిల్లా రేణిగుంట మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో (సర్) ప్రక్రియలో భాగంగా అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన కార్యక్రమం వేగవంతంగా సాగింది. ముందస్తుగా నోటీసులు అందుకున్న అభ్యర్థులు తమకు సంబంధించిన అవసరమైన ఒరిజినల్ డాక్యుమెంట్లు, ఆధారాలతో కార్యాలయానికి చేరుకుని అధికారులకు సమర్పించారు.
ఈ పరిశీలన కార్యక్రమంలో రేణిగుంట తహసీల్దార్ శ్రావణ్ కుమార్ కుమార్, ఎంపీడీఓ రవిచంద్ర, డిప్యూటీ తహసీల్దార్ శ్యామ్ ప్రసాద్, డిప్యూటీ ఎంపీడీఓలతో పాటు పలువురు మండల అధికారులు పాల్గొని అభ్యర్థులు అందించిన పత్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అర్హతకు సంబంధించిన ఆధారాలను పరిశీలించి, అవసరమైన వివరాలను రికార్డుల్లో నమోదు చేసుకున్నారు.
ఈ సందర్భంగా ఎంపీడీఓ రవిచంద్ర మాట్లాడుతూ.. సర్ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, నిబంధనలకు లోబడి జరుగుతోందని తెలిపారు. అభ్యర్థులు సమర్పించిన ప్రతి ధ్రువపత్రాన్ని సమగ్రంగా పరిశీలిస్తున్నామని, ఏవైనా సాంకేతిక లోపాలు లేదా సందేహాలు ఉంటే సంబంధిత అభ్యర్థుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని చెప్పారు. అర్హులైన అభ్యర్థుల సమాచారాన్ని త్వరలోనే తుది జాబితా ద్వారా వెల్లడిస్తామని, ఎవరికీ ఎలాంటి అన్యాయం జరగకుండా అన్ని వివరాలను సమగ్రంగా తనిఖీ చేసిన తర్వాతే తదపరి చర్యలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. నోటీసులు పొందిన ప్రతీ ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.

