రైతుల సమస్యల పరిష్కారమే రెవెన్యూ ధ్యేయం: తహసీల్దార్ శ్రావణ్ కుమార్.
జడ్పీ హైస్కూల్ విద్యార్థులకు పెన్నులు, చాక్లెట్ల పంపిణీ..
రేణిగుంట ఆగష్టు 15.
తిరుపతి జిల్లా రేణిగుంట మండల తహసీల్దార్ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా, ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా తహసీల్దార్ శ్రావణ్ కుమార్ మువ్వన్నెల త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి, జాతీయ పతాకానికి వందనం సమర్పించారు.
జెండా ఆవిష్కరణ అనంతరం తహసీల్దార్ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ… మహనీయుల ప్రాణత్యాగాల ఫలమే నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్ర్యమని కొనియాడారు. దేశ ప్రగతిలో రెవెన్యూ వ్యవస్థ పాత్ర అత్యంత కీలకమైందని, ప్రజలకు నాణ్యమైన, వేగవంతమైన సేవలు అందించడమే అధికారుల ముఖ్య లక్ష్యమని పేర్కొన్నారు. ముఖ్యంగా రైతుల భూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించడం, ప్రభుత్వ సంక్షేమ ఫలాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ పారదర్శకంగా అందించడంలో రెవెన్యూ సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఈ వేడుకల్లో స్థానిక జడ్పీ హైస్కూల్ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. జెండా ఆవిష్కరణ కార్యక్రమం ముగిసిన అనంతరం విద్యార్థులకు పెన్నులు, చాక్లెట్లను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ శ్యామ్ ప్రసాద్, రీ-సర్వే డీటీ దిలీప్, శ్రీకాళహస్తి రెవెన్యూ డివిజన్ వీఆర్వో సంఘం అధ్యక్షుడు శంకరయ్య, వీఆర్వోలు మల్లికార్జున రెడ్డి, హేమంత్, దిలీప్, సాయి, చరణ్, నళిని, బాబు తో పాటు తదితర వీఆర్వోలు, కార్యాలయ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.

