- అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక తనిఖీలు.
- శివారు, అటవీ ప్రాంతాల్లో పోలీసుల ఆకస్మిక తనిఖీలు.
- బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న 8 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.
- అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చట్టపరమైన చర్యలు.
తిరుపతి ఆగష్టు 23: తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా జూదం, బహిరంగ మద్యపానం మరియు ఇతర అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.
ఇందులో భాగంగా బీఎన్. కండ్రిగ పోలీస్ స్టేషన్ పరిధిలోని కంచనపుత్తూరు శివారు ప్రాంతంలో పోలీసులు తనిఖీలు నిర్వహించి, బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా కుక్కంబాకం అటవీ ప్రాంతంలో జూదం జరిగే అవకాశం ఉన్న అనుమానిత ప్రదేశాలను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
జిల్లా వ్యాప్తంగా శివారు ప్రాంతాలు, అటవీ ప్రాంతాలు, నిర్మానుష్య ప్రదేశాలు తదితర ప్రాంతాల్లో అనుమానిత కార్యకలాపాలపై నిరంతరం నిఘా కొనసాగుతోంది. జూదం, బహిరంగ మద్యపానం వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణకు ఇటువంటి ప్రత్యేక తనిఖీలు మరియు నిఘా చర్యలు జిల్లా వ్యాప్తంగా నిరంతరం కొనసాగుతాయని పోలీసులు తెలిపారు.

