

Mana News :- ఏపీ ప్రభుత్వం హామీల అమలు పైన కసరత్తు చేస్తోంది. 2025-26 వార్షిక బడ్జెట్ లో తల్లికి వందనం తో పాటుగా అన్నదాత సుఖీభవ అమలు కోసం నిధులు కేటాయించింది. మే నెలలో తల్లికి వందనం అమలు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. అన్నదాత సుఖీభవ మూడు విడతల్లో చెల్లించేలా నిర్ణయం తీసుకున్నారు. ఇక, ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు పైన ప్రభుత్వం అధికారుల నుంచి నివేదిక కోరింది. క్షేత్ర స్థాయిలో కసరత్తు జరుగుతోంది. ఈ పథకం అమలు దిశగా కార్యాచరణ సిద్దం అవుతోంది. ఉచిత బస్సు :- కూటమి నేతలు ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే అమలు చేసేలా ఆరు కీలక హామీలను ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఏడాదికి మూడు గ్యాస్ సిలండర్లతో పాటుగా.. బడ్జెట్ లో మరో రెండు పథకాలకు నిధులు కేటాయించారు. ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పైన కసరత్తు చేస్తున్నారు. తాజాగా మండలిలో మంత్రి సంధ్యారాణి తాము ఇచ్చిన హామీ మేరకు మహిళలకు జిల్లాల పరిధిలో ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తామని వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం అమలు భారం.. తీసుకోవాల్సిన చర్యల పైన అధికారుల నుంచి ప్రభుత్వం నివేదిక తీసుకుంది. పథకం అమలు పై :- ఆ తరువాత పొరుగు రాష్ట్రాల్లో ఈ పథకం అమలు తీరు పైన అధ్యయనం కోసం ముగ్గురు మంత్రులతో కమిటీ నియమించారు. ఇప్పటికే మంత్రులు తెలంగాణ, కర్ణాటకలో పర్యటించి ఈ పథకం అమలును పరిశీలించారు. అధికారులు ఇచ్చిన నివేదికలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలుచేస్తే మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతుందని, అదనంగా 2,000ల కొత్త బస్సులు అవసరమని అధికారులు అంచనా వేశారు. చాలాకాలంగా ఉద్యోగ నియామకాలు లేక, పదవీ విరమణల కారణంగా ఆర్టీసీలో డ్రైవర్ల కొరత వేధిస్తోంది. కొత్తగా 3,500 మంది వరకు డ్రైవర్ పోస్టులు భర్తీ చేయాలని నివేదికలో పేర్కొన్నారు. ఆర్టీసీ పై భారం :- మహిళలకు ఉచిత ప్రయాణం అమలుతో ఆర్టీసీకి నెలకు రూ.250 నుంచి రూ.260 కోట్ల వరకు రాబడి కోల్పోనుంది. ఈ మొత్తాన్ని ప్రభుత్వం ప్రతినెలా సర్దుబాటు చేయాల్సి ఉంటుందని తేల్చారు. ప్రస్తుతం ఆర్టీసీకి ప్రతినెలా వచ్చే రాబడిలో 25 శాతం అంటే దాదాపు రూ.125 కోట్లను సర్కార్ తీసుకుంటోంది. ఇకపై ఆ మొత్తాన్ని ప్రభుత్వం తీసుకోకూడదని, అలాగే మిగిలిన రూ.125 నుంచి రూ.135 కోట్లను అదనంగా ప్రభుత్వమే, ఆర్టీసీకి చెల్లించాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీంతో, కొత్త సంత్సరంలో ఈ పథకం అమలు చేసేందుకు ప్రభుత్వం ముందస్తు కరసరత్తు చేస్తోంది. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తరువాత ఈ పథకం పైన అధికారికంగా నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
