

మన న్యూస్,పిఠాపురం:- భయం లేదు భయం లేదు భయమన్నది లేనే లేదు అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ప్రసంగించారు. పిఠాపురం చిత్రాడలో జరిగిన జనసేన ఆవిర్భావ సభ పవన్ కళ్యాణ్ కీలక ప్రసంగం చేశారు. ఇల్లు దూరమైనా.. చేతిలో దీపం లేకపోయినా.. అన్ని ఒక్కడ్నే అయి ముందుకు నడిచినట్లు తెలిపారు. 2014లో జనసేన పార్టీని స్థాపించామన్నారు. బావ తీవ్రత ఉన్నందుకే పోరాట యాత్ర చేశామన్నారు. ఓటమి భయం లేదు గనుకే 2019లో పోటీ చేశామన్నారు. ఓడినా అడుగు ముందుకే వేశామన్నారు. మనం నిలబడ్డాం. పార్టీని నిలబెట్టాం. నాలుగు దశాబ్దాలుగా ఉన్న టీడీపీ పార్టీని కూడా నిలబెట్టాం అని పవన్ కళ్యాణ్ అన్నారు. 2019లో మనం ఓడిపోయినప్పుడు వైసీపీ నేతలు సంబరపడి ఎన్నో అవమానాలకు గురిచేశారని పవన్ చెప్పారు. చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడిని జైల్లో పెట్టారని తెలిపారు. తనపై వైసీపీ ప్రభుత్వం చేయని కుట్రలేదని అన్నారు. మనల్ని అసెంబ్లీ గేటును కూడా తాకలేవు అని చరిచిన ఆ తొడల్ని బద్దలు కొట్టామని పవన్ వ్యాఖ్యానించారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో 100 శాతం స్ట్రైక్ రేట్తో గెలిపిచి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏపీలో నిలబెట్టామన్నారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. కరెంట్ షాక్ తగిలి చనిపోబోయిన తాను.. కొండగట్టు అంజన్న దీవేలతో.. తెలంగాణ ప్రజల దీవెనలతో ప్రాణాలతో బయటపడినట్లు తెలిపారు. గద్దర్ పాటను గుర్తు చేసుకున్నారు. నా అన్న గదరన్నకు వందనం అని తెలిపారు. తెలంగాణ నుంచి వచ్చిన జనసైనికులకు అభినందనలు తెలిపారు. జనసేనకు తెలంగాణ జన్మభూమి.. ఆంధ్రప్రదేశ్ కర్మభూమి అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. గద్దరన్న ఖుషీ సినిమా చూసిన తర్వాత తన అన్నయ్యను కలిసి అనంతరం తనను కలిశారని పవన్ చెప్పారు. యే మేరా జహా పాటను ప్రశంసించారన్నారు. భారతమాతను సంకెళ్లను బంధించావు కాదా నీ భావం అర్థమైందినీవు ప్రజా సేవకు వెళ్లాలని గద్దర్ చెప్పారు అని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. భారతదేశానికి బహుభాషే మంచిది -హిందీలో మాట్లాడుతూ.. హోలీ శుభాకాంక్షలు తెలిపారు. తనను ఆదరించిన తమిళనాడు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. భారతదేశానికి బహుభాషే మంచిదని పవన్ అన్నారు. తమిళనాడు సహా అన్ని రాష్ట్రాలకు ఒకే విధానం ఉండాలని ఆయన స్పష్టం చేశారు. త్రిభాష విధానంపై చర్చ జరుగుతున్నవేళ పవన్ కళ్యాన్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రసంగిస్తున్న సమయంలో ఓజీ ఓజీ అని అరుస్తున్న కార్యకర్తలను వారించారు పవన్ కళ్యాణ్. నా మాట వినడం వల్లే 151 సీట్లున్న పార్టీ పోయిందన్నారు. ఇప్పుడు కూడా తన మాట వినండి అని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఐ లవ్యూ అంటూ కార్యకర్తలనుద్దేశించి అన్నారు పవన్. పోలీసు శాఖ అంటే తనకు ఎంతో గౌరవమని పవన్ కళ్యాణ్ చెప్పారు. సభకు సహకరించిన పోలీసులకు, డీజీపీ, కాకినాడ ఎస్పీకి, అధికారులకు పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. తాను పోలీసు కానిస్టేబుల్ కొడుకుని ఉన్నతాధికారి కావాలనుకున్నారు కానీ.. తాను డిగ్రీ ఫెయిల్ అయ్యాయని చెప్పారు.చంటి సినిమాలో హీరోయిన్ మీనాను పెంచినట్లు తమ ఇంట్లో తనను చూసుకున్నారని పవన్ తెలిపారు. తనను బయటికి వెళ్లనిచ్చేవారు కాదన్నారు. ఒకసారి సాయంత్రం 6 గంటలకు వెళ్లాల్సిన తాను పదిన్నరకు ఇంటికి వెళ్లగా ఇంట్లోవారంతా ఎదురుచూశారన్నారు. చిరంజీవి సినిమా షూటింగ్ రద్దు చేసుకుని వచ్చారన్నారు. నాగబాబు ఇంటి బయట ఎదురుచూశారన్నారు. తొలి ప్రేమ సినిమా సమయంలో తాను సంగీత్ థియేటర్లో ఓ ఇంగ్లీష్ సినిమా చూసేందుకు సెకండ్ షోకి వెళితే.. తన తండ్రి తిట్టాడని చెప్పారు. తాను హీరోను అని చెబితే ఇంకా తిట్టారన్నారు. తన తండ్రి తన అన్నయ్యను ఎక్కువ కొట్టేవారని చెప్పారు. దీంతో తాను ఏమి అనకుండా ఉండిపోయేవాడనని చెప్పారు. అలాంటి తాను రాజకీయాల్లోకి రావడం దేవుడి రాతే అని అన్నారు. తాను మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చానన్నారు.
