

Mana News:- ప్రస్తుతం ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ జరుగుతోంది. అదే సమయంలో మరోసారి ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈసారి ఎమ్మెల్యే కోటా ఎన్నికల నోటిఫికేషన్. ఏపీలో ఐదు, తెలంగాణలో ఐదు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో యనమల రామకృష్ణుడు, జంకా కృష్ణమూర్తి, బీటీ నాయుడు, అశోక్ బాబు, దువ్వారపు రామారావుల పదవీకాలం మార్చ్ నెలాఖరుతో పూర్తవుతోంది. వీటిలో జనసేన తరపున నాగబాబుకు, బీజేపీకు ఒకటి కేటాయించనున్నారు. మిగిలిన మూడు స్థానాల్లో తెలుగుదేశం అభ్యర్ధులు బరిలో దిగుతారు. టీటీపీ నుంచి ముగ్గురిలో యనమల రామకృష్ణుడికి మరో అవకాశం ఇస్తారని తెలుస్తోంది. మిగిలిన రెండు స్థానాల కోసం పార్టీలో పోటీ తీవ్రంగా ఉంది. ఇక తెలంగాణలో శేరి సుభాష్ రెడ్డి, ఎగ్గె మల్లేశం, మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, మీర్జా హసన్ పదవీకాలం ముగియనుంది. ఇలా మొత్తం 10 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. మార్చ్ 20వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజు ఫలితాలు ఉంటాయి. పదవీకాలం ఈ నెలాఖరుతో ముగుస్తుండటంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఎమ్మెల్సీ ఎన్నికల తేదీలు :- మార్చ్ 3 ఎన్నికల నోటిఫికేషన్ , మార్చ్ 10 నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ, మార్చ్ 11 నామినేషన్ల పరిశీలన , మార్చ్ 13 నామినేషన్ల ఉపసంహరణ గడువు ,మార్చ్ 20 ఎమ్మెల్సీ ఎన్నికలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ,మార్చ్ 20 సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ .