జియ్యమ్మవలస/గుమ్మలక్ష్మీపురం/మనధ్యాస డిసెంబర్6 రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జియ్యమ్మవలస మండలంలోని అన్ని పంచాయితీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీ స్థానాలను కూటమి అభ్యర్థులే గెలుచుకోవాలని ప్రభుత్వ విప్, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి పిలుపునిచ్చారు.
శనివారం గుమ్మలక్ష్మీపురం మండలంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జియ్యమ్మవలస మండల స్థాయి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశం జరిగింది. మండల పార్టీ అధ్యక్షులు జోగి భుజంగరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జగదీశ్వరి మాట్లాడుతూ… గ్రామాల అభివృద్ధి, పార్టీ బలోపేతం, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రతి ఇంటికీ చేరవేయడం పార్టీ బాధ్యతగా పేర్కొన్నారు.
మండల, గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వంద శాతం కూటమి అభ్యర్థులనే గెలిపించే విధంగా కృషి చేయాలని సూచించారు.
గ్రామాల్లో ఉన్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకునేలా కార్యాచరణ రూపొందించాలని అన్నారు.పార్టీ అభివృద్ధి, ప్రజలతో పరిచయం, గ్రామ స్థాయి ఎన్నికల వ్యూహాలపై ఎమ్మెల్యే జగదీశ్వరి నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్య నిర్వహణ కార్యదర్శి దత్తి లక్ష్మణరావు. అరకు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి.డొంకాడ రామకృష్ణ. ప్రెసిడెంట్ జి రామకృష్ణ. మజ్జి చంద్రమౌళి. బి ప్రకాష్ రావు. తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.








