శంఖవరం : కాకినాడ సబ్ప్లాన్ పరిధిలోని శంఖవరం, ప్రత్తిపాడు, రౌతులపూడి, ఏలేశ్వరం మండలాలకు చెందిన 12 గిరిజన గ్రామ పంచాయతీల కమిటీలు సంయుక్తంగా సమావేశమై 59 గిరిజన గ్రామాల తరఫున ఏకగ్రీవంగా తీర్మానం చేసి తమ డిమాండ్లను ఎంపీ ఉదయశ్రీనివాస్ కి వినతిపత్రంగా అందజేశారు. ఈ సమావేశం జనసేన నాయకులు మరియు విజయవాడ రైల్వే డివిజనల్ కమిటీ మెంబర్ గొర్లి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగింది.
గిరిజన గ్రామాల ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ – ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న కొత్త జిల్లాలు, మండలాల పునర్వ్యవస్థీకరణలో తమ గ్రామాలను నిర్లక్ష్యం చేయరాదని, పెదమల్లాపురం కేంద్రంగా కొత్త షెడ్యూల్డ్ మండలాన్ని ఏర్పాటు చేయడంతో పాటు ఐటిడిఎ కార్యాలయం కూడా అక్కడే స్థాపించాలన్నారు. అంతేకాకుండా ఈ మండలాన్ని రంపచోడవరం కేంద్రంగా ఏర్పడబోయే కొత్త జిల్లాలో విలీనం చేయాలని తమ విన్నపంలో పేర్కొన్నారు.
ఎంపీ ఉదయశ్రీనివాస్ ఈ వినతిపత్రాన్ని స్వీకరించి సానుకూలంగా స్పందించారు. ఆదివాసీ ప్రజల హక్కులు, అభివృద్ధి కోసం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటానని, ఈ డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం వచ్చేలా ప్రయత్నిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఎంపీ ఇచ్చిన ఈ హామీ గిరిజన ప్రజల్లో నూతన నమ్మకం నింపింది.
గిరిజన నాయకులు తమ వేదనను వ్యక్తం చేస్తూ – 1947లో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తమ గ్రామాలు 5వ షెడ్యూల్ పరిధిలో ఉండగా, తరువాతి విభజనల్లో పొరపాటున నాన్-షెడ్యూల్డ్ ప్రాంతంలో చేర్చడం వలన రాజ్యాంగం కల్పించిన రక్షణలు, హక్కులు కోల్పోయామని తెలిపారు. దీని వల్ల తమ సంస్కృతి, సంప్రదాయాలు, ప్రాచీన ఆధారాలు నశించే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ ఈ ప్రాంతంలో 50 శాతం కంటే తక్కువ మంది మాత్రమే విద్యావంతులుగా ఉన్నారని, దారిద్ర్యం, వెనుకబాటుతనం మాకెప్పుడూ వెంటాడుతున్నాయని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో పెదమల్లాపురం కేంద్రంగా కొత్త మండలం ఏర్పాటు చేసి రంపచోడవరం జిల్లాలో విలీనం చేయడం ద్వారానే గిరిజన గ్రామాల అభివృద్ధి సాధ్యమని, లేకపోతే భవిష్యత్తు తరాలు కూడా నష్టపోతాయని వారు స్పష్టం చేశారు. ఏకగ్రీవంగా తీర్మానం చేసి వినతిపత్రాన్ని ఎంపీకి అందజేయగా ఆయన సానుకూలంగా స్పందించడం గిరిజనులలో ఆనందాన్ని కలిగించింది.
ఈ కార్యక్రమంలో పెద్దమల్లాపురం జనసేన అధ్యక్షులు కొరిప్రోలు రమేష్, వీరమహిళ జర్త సరస్వతి, జనసేన నాయకులు జర్త శ్రీను, తురుం నాగేశ్వరరావు, గిరిజన సాధన కమిటీ సభ్యులు జర్తా ముసలయ్య, భూసూరి బాలరాజు, తుంపాటి శ్రీను, వెలుగుల లక్ష్మణ్, వెలుగుల కుమార్, తుంపాటి అజ్జమ్మ, తోట ముసలయ్య, బెదల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.







