

మన న్యూస్: పినపాక, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్న సందర్భంగా నిర్వహిస్తున్న ప్రజా పాలన విజయోత్సవ సంబరాలలో భాగంగా సోమవారం ఏడూళ్ళ బయ్యారం క్రాస్ రోడ్ లోని జీ వీ ఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సంబరాలకు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు భారీ ఎత్తున డప్పు చప్పులతో బాణసంచ కాల్చి సంబరాలు నిర్వహించారు. అనంతరం సీ ఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని, దేశానికి అన్నం పెట్టే రైతన్న సుభిక్షంగా ఉండాలన్న సంకల్పంతో ప్రజా రంజక పాలన సాగిస్తుందన్నారు. ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేసి చూపిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్నిదన్నారు. మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం, 200 యూనిట్ల ఉచిత కరెంటు, రూ 500 కే గ్యాస్, రైతులకు రూ 2 లక్షల రుణమాఫీ పథకాలను అమలు చేసి , ఇందిరమ్మ ఇల్లు, గృహలక్ష్మి పథకంలో భాగంగా అర్హులైన ప్రతి మహిళకు నెలకు రూ 2500 ఆర్థిక సాయం అమలకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి అన్నారు. ప్రజలు గమనించాల్సిన విషయం ఏమిటంటే గత ప్రభుత్వం పదేళ్ల పాలనలో రాష్ట్రం దివాలా తీసిందని, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి, పేదల కోసం, ప్రజల కోసం పనిచేసే ప్రజా వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసిన పాపం, గత పాలకులదని అన్నారు. రాష్ట్రం ఆర్థికంగా ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్న మొక్కవోని దీక్షతో ధైర్యంతో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయటం దేశ చరిత్రలోనే సరికొత్త అధ్యయమన్నారు. ప్రభుత్వం చేసిన కుంభకోణాలు, దందాలకు పేదలపై భారం పడిందన్నారు. గత పదేండ్ల లో బీ ఆర్ ఎస్ ఇచ్చిన హామీలలో ఉచిత ఎరువులు, నిరుద్యోగ భృతి, రైతు రుణమాఫీ ఎందుకు అమలు చేయలేక పోయిందో ప్రజలకు జవాబు చెప్పాలన్నారు. ధరణి పేరుతో రాష్ట్రంలో ఉన్న భూములన్నీ బీ ఆర్ఎస్ నాయకులకు అన్యాక్రాంతమయ్యాయన్నారు. లగచర్ల ఘటనలో బీ ఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూసి, బొక్క బోర్లా పడ్డారన్నారు. ఈ రాష్ట్రంలో ఆర్థికపరమైన సమస్యలు ఎన్ని ఉన్నా సంక్షేమ పథకాల అమలకు వెనుకాడబోమని, బీ ఆర్ఎస్ నాయకులకు గ్రామాల్లో కొచ్చి ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు. వరి వేస్తే ఉరే అన్న సన్నాసులు ఎక్కడ.. సన్న రకం ధాన్యానికి మద్దతు ధరతో, క్వింటా కు 500 రూపాయల బోనస్ ఇస్తున్న ప్రభుత్వం ఎక్కడా ? అని నిలదీయాలని సూచించారు. మరో ఏడాదిలో అద్భుతమైన అభివృద్ధితో దేశం గుర్తించేలా రాష్ట్ర పాలన ఉండబోతుందన్నారు. కార్యక్రమంలో పినపాక మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గొడిశాల రామనాథం, పినపాక మాజీ వైస్ ఎంపీపీ కంది సుబ్బారెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొర్శా ఆనంద్, గంగిరెడ్డి వెంకట్ రెడ్డి, పేరం వెంకటేశ్వరరావు, ఉడుముల లక్ష్మారెడ్డి, గంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పరిమి వెంకటేశ్వరరావు, తోలెం కళ్యాణి, ఈసం భవతి, బండారు సాంబశివరావు, ఆరె నవీన్, తోలేం అర్జున్, ఉప్పలపాటి కిషోర్, మల్లయ్య, నవాతి శ్రీను, పడాల రాము, బూర రవి, కొమరం రాములు, మద్దెల సమ్మయ్య, కస్తూరి లింగయ్య, స్వతంత్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.