

మన న్యూస్, గద్వాల జిల్లా, జూన్ 25: లైంగిక వేధింపులకు గురైన బాధిత మహిళలకు వైద్య, న్యాయ, కౌన్సిలింగ్, సైకలాజికల్ సహాయం వంటి సేవలను ఒకే గొడుగు క్రింద అందిస్తూ భరోసా కేంద్రం చేస్తున్న సేవలు ప్రశంసనీయం అని జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాస రావు ఐపీఎస్ అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని భరోసా కేంద్రం మూడవ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో భరోసా సిబ్బంది, బాధిత మహిళలతో కలిసి ఈ వేడుకలు నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా భరోసా కేంద్రంలో ఇప్పటివరకు నమోదైన కేసులు, అందిన సేవల వివరాలు భరోసా WSI స్వాతి మరియు సిబ్బంది ఎస్పీకి వివరించారు. బాధిత మహిళలకు తక్షణ ఆర్థిక సహాయం, విద్యా అవకాశాలు, న్యాయ సహాయం వంటి అనేక సేవలు అందుతున్నాయని ఎస్పీ తెలిపారు. ముఖ్యంగా, పదవ తరగతి చదువుతున్న బాధిత విద్యార్థులను ప్రోత్సహిస్తూ బహుమతులు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, బాధితుల స్టేట్మెంట్లు సరిగ్గా నమోదు చేయడంతో పాటు, వారికి నాణ్యమైన మానసిక, శారీరక సహాయాన్ని కల్పించాలన్నారు. బాధితులు భవిష్యత్తులో ఆర్థికంగా స్వయం సమృద్ధిగా ఎదగేలా ప్రోత్సహించాలన్నారు. భరోసా సేవలు నిరంతరం 24 గంటలు అందుబాటులో ఉండాలని, సేవల పరంగా ఎప్పటికప్పుడు బాధితులకు అండగా నిలవాలని సూచించారు. ఇప్పటి వరకు అందిస్తున్న సేవల తీరును ప్రశంసించిన ఎస్పీ, భరోసా సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో గద్వాల డీఎస్పీ మొగిలయ్య, భరోసా కోఆర్డినేటర్ శివాని, స్రవంతి, శ్వేత, శిరీష, కవిత, కీర్తి తదితరులు పాల్గొన్నారు.
