

మన న్యూస్ సింగరాయకొండ:-
సింగరాయకొండ మండలంలోని పాకల బీచ్ వద్ద పర్యాటకుల భద్రతను దృష్టిలో పెట్టుకొని నిర్మించిన బే వాచ్ టవర్ను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారు, జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా ఐఏఎస్, ఎస్పీ ఏ.ఆర్. దామోదర్ ఐపీఎస్ ఆదివారం ప్రారంభించారు. ఈ వేదికపై జాయింట్ కలెక్టర్ ఆర్. గోపాలకృష్ణ, ఇతర జిల్లా అధికారులు కూడా పాల్గొన్నారు.సుమారు రూ.15 లక్షల వ్యయంతో నిర్మించిన ఈ వాచ్ టవర్ ద్వారా సముద్రతీరాన్ని పర్యవేక్షించడమే కాకుండా, ప్రమాదకర ప్రవాహాలను ముందుగానే గుర్తించి స్పందించే అవకాశాలు కలుగుతాయని అధికారులు పేర్కొన్నారు. జాతీయ జెండా, సింహతలాటం వంటి గుర్తింపు బేస్లతో కూడిన ఈ టవర్ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపును కల్పించింది.మంత్రివర్యులు మాట్లాడుతూ, “ప్రతి పర్యాటకుడు సురక్షితంగా తిరిగి వెళ్లేలా చూడడమే ప్రభుత్వ ధ్యేయం. గతంలో పాకల బీచ్ వద్ద జరిగిన దుర్ఘటనల నేపథ్యంలో ఈ వాచ్ టవర్ నిర్మించాం. పోలీసులు, కోస్టల్ గార్డ్తో సమన్వయం ద్వారా తీర ప్రాంత భద్రతను మరింత బలోపేతం చేస్తాం” అని తెలిపారు.జిల్లా కలెక్టర్ గారు మాట్లాడుతూ, పాకల బీచ్ ప్రస్తుతం జిల్లా స్థాయిలో ఒక ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుండగా, అక్కడ భద్రతాపరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం చాలా అవసరం అని వివరించారు.జిల్లా ఎస్పీ దామోదర్ మాట్లాడుతూ, వాచ్ టవర్ ద్వారా సముద్రపు మార్పులను రియల్ టైమ్లో పర్యవేక్షించి, సీసీ కెమెరాలు, హెచ్చరిక బోర్డులు, పబ్లిక్ అడ్రెస్సింగ్ సిస్టమ్, ఎమర్జెన్సీ స్పందన వ్యవస్థతో తక్షణ చర్యలు తీసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.ఈ వాచ్ టవర్ నిర్మాణం, పరికరాల ఏర్పాటు లో కీలక పాత్ర పోషించిన సిఐ హాజరత్తయ్య, ఎస్సై మహేంద్రలను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో ఆర్డిఓ లక్ష్మీ ప్రసన్న, ఏఆర్ డిఎస్పీ శ్రీనివాసరావు, కోస్టల్ సెక్యూరిటీ సీఐ శివన్నారాయణ, ఆర్ఐలు రమణారెడ్డి, సీతారామిరెడ్డి, ఎస్సైలు మహేంద్ర, నాగమలేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
