

మన న్యూస్, నెల్లూరు :వైద్య రంగంలో ఉత్తమ వసతులతో కూడిన వైద్య సేవలు అందించడం కిమ్స్ హాస్పిటల్ కే సాధ్యమైందని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి అన్నారు. ఈ 25 ఏళ్ల కాలంలో అనేక మైళు రాళ్లు అధిగమించి ఈ స్థాయికి చేరుకున్నారని చెప్పారు. నగరంలోని కస్తూరి దేవి గార్డెన్స్ లో వైభవంగా నిర్వహించిన కిమ్స్ హాస్పిటల్ సిల్వర్ జూబ్లీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేయగా.. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, రాజ్యసభ ఎంపీ బీద మస్తాన్ రావు, పాశం సునీల్ కుమార్, కాకర్ల సురేష్,బొల్లినేని కృష్ణయ్య, శీనయ్య, భాస్కర్ రావ్ ఇతర ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అనంతరం ఎంపీ వేమిరెడ్డి మాట్లాడుతూ ….కిమ్స్ హాస్పిటల్ స్థాపించిన బొల్లినేని కుటుంబానికి నెల్లూరు కావడం గర్వంగా ఉందన్నారు. నెల్లూరు వ్యక్తి ఈ స్థాయికి ఎదగడం సంతోషంగా ఉందన్నారు. కిమ్స్ తన సేవలను ఐదు రాష్ట్రాలకు విస్తరించిందని, ఇది గొప్ప విషయమన్నారు. ప్రజలకు తక్కువ ధరకే మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారన్నారు. కిమ్స్ గురించి చెప్పేటప్పుడు డాక్టర్ శ్రీనివాసరాజు గురించి మాట్లాడుకోవాలన్నారు. ఆయక కిమ్స్కు మాత్రమే కాదని, నెల్లూరు ప్రజల వ్యక్తి అని కొనియాడారు. కిమ్స్ హాస్పిటల్ భవిష్యత్తులో మరిన్ని విజయాలు నమోదు చేయాలని, దేశంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించాలని ఆయన ఆకాంక్షించారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ…… దేశంలోని ఐదు రాష్ట్రాల్లో వైద్య సేవలు అందిస్తూ లక్షలాదిమంది ప్రాణాలకు కాపాడుతున్న కిమ్స్ హాస్పిటల్ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కిమ్స్ హాస్పిటల్ విజయంలో కీలక పాత్ర పోషించిన హాస్పిటల్ యాజమాన్యానికి, వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. అన్నదమ్ముల ఐకమత్యంతో ఇంతస్థాయికి చేరిందని వెల్లడించారు. ప్రతి ఒక్కరినీ కుటుంబ సభ్యులుగా భావించడం వల్లే ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగారన్నారు. నెల్లూరులో ఎన్నో గుండెలకు ప్రాణం పోసిన వ్యక్తి శ్రీనివాసరాజు అని, అలాంటి వ్యక్తులు ఎంతో మంది కిమ్స్లో ఉన్నారని, వారందరి కృషితో హాస్పిటల్ ఈ స్థాయికి ఎదిగిందన్నారు.



