
Mana News :- తెలంగాణ అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ కీలక వ్యాఖ్యలు చేసారు. మాజీ సీఎం కేసీఆర్ కు సవాల్ చేసారు. ఎమ్మెల్యేగా కేసీఆర్కు రూ.54.84 లక్షల జీతం ఇచ్చారని..అసెంబ్లీకి మాత్రం రెండు సార్లే హాజరయ్యారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చినప్పుడే కృష్ణా జలాలపై చర్చ పెడదామని చెప్పారు. రోజా ఇంట్లో కేసీఆర్ రొయ్యల పులుసు తిని.. రాయలసీమను రతనాల సీమ చేస్తామన్నారని గుర్తుచేశారు. తన వరుస ఢిల్లీ పర్యటనలు.. రాష్ట్ర ఆర్దిక పరిస్థితుల గురించి సీఎం రేవంత్ సభలో వివరించారు.రేవంత్ కీలక వ్యాఖ్యలు :- తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంలో ముఖ్యమంత్రి రేవంత్ పలు అంశాలను ప్రస్తావించారు. బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పులు గురించి వివరించారు. ఈ నెల 17న బీసీ రిజర్వేషన్, 18న ఎస్సీ వర్గీకరణ పైన చర్చ చేపట్టనున్నట్లు రేవంత్ వెల్లడించారు. తమ ప్రభుత్వం పైన ప్రజల్లో కోపం ఉందని ప్రచారం చేస్తున్నారని.. ప్రజలకు మంచి చేసే వారి పైన ఎందుకు కోపం ఉంటుందని ప్రశ్నించారు. తాను ఢిల్లీకి వెళ్లి రాష్ట్ర ప్రయోజనాల కోసమే కేం ద్ర మంత్రులను కలుస్తున్నానని చెప్పుకొచ్చారు. ప్రధాని పైన తమకు గౌరవం ఉందని చెప్పారు. కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నామని వివరించారు. కేసీఆర్ చేసిన అప్పుకు 15 నెలల కాలంలో లక్షా 53 వేల కోట్లు చెల్లించామని రేవంత్ చెప్పుకొచ్చారు. చర్చకు సిద్దం :- మాజీ సీఎం కేసీఆర్ కు రేవంత్ సవాల్ చేసారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చినప్పుడే కృష్ణా జలాలపై చర్చ పెడదామని అన్నారు. తాము తప్పు మాట్లాడినట్లు తేలితే క్షమాపణలు చెప్పేందుకు కూడా సిద్ధమని స్పష్టం చేశారు. రోజా ఇంట్లో కేసీఆర్ రొయ్యల పులుసు తిని.. రాయలసీమను రతనాల సీమ చేస్తామన్నారని గుర్తుచేశారు. ఒక్కసారి రొయ్యల పులుసు పెడితేనే రాయలసీమను రతనాల సీమ చేస్తా అని అన్నారని గుర్తు చేసారు. ఎంపీగా గెలిపించిన పాలమూరు ప్రజలను మోసం చేశా ని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలోనే సాగర్కు సీఆర్పీఎఫ్ బలగాలు వచ్చాయని గుర్తు చేసారు. అప్పుడు మౌనంగా ఉన్న బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పుబడుతోందంటూ రేవంత్ మండి పడ్డారు. కేసీఆర్ వందేళ్లు జీవించాలి :- కృష్ణా నీటి విషయంలో రాష్ట్రానికి మరణశాసనం రాశారని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేసారు. బీఆర్ స్ హయాంలోనే పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని పెంచారని గుర్తుచేశారు. కమీషన్ల కోసమే జూరాల నుంచి తీసుకోవాల్సిన నీళ్లను శ్రీశైలం బ్యాక్ వాటర్ ద్వారా తీసుకుంటామన్నది నిజం కాదా అని నిలదీశారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ఉమ్మడి రాష్ట్రంలోనే 20 కి.మీ మేర పూర్తి చేశారని తెలిపారు. కేసీఆర్ పాలనలో ప్రాజెక్ట్ పనులే చేపట్టలేదన్నారు. ఎస్ఎల్బీసీ ప్రమాదంపై సానుభూతి చూపించాల్సిన బీఆర్ఎస్ నేతలు పైశాచిక ఆనందం పొందుతున్నారని మండిప డ్డారు. కేసీఆర్ వందేళ్లు జీవించి ప్రతిపక్షంలోనే ఉండాలని కోరుకుంటున్నానని రేవంత్ వ్యాఖ్యానించారు. అయితే సీఎం మాట్లాడుతున్న సమయంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు.
