Mana News, హైదరాబాద్: నియోజకవర్గాల పునర్విభజనపై త్వరలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి..రాజకీయ పార్టీలకు బహిరంగ లేఖ రాశారు. క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయం ప్రకారం నియోజకవర్గాల పునర్విభజనపై అఖిలపక్ష భేటీ నిర్వహించాలనుకుంటున్నట్లు లేఖలో పేర్కొన్నారు.
''జనాభా ప్రాతిపదికన జరగబోయే నియోజకవర్గాల పునర్విభజనతో తెలంగాణకు ప్రమాదం. జరగబోయే నష్టం గురించి అన్ని పార్టీలను ఆహ్వానించి చర్చించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఏర్పాటు చేస్తున్న ఈ సమావేశానికి అన్ని పార్టీలు హాజరుకావాలి. ప్రతి పార్టీని ప్రత్యేకంగా ఆహ్వానిస్తాం. త్వరలోనే భేటీకి సంబంధించిన తేదీ, వేదిక ప్రకటిస్తాం'' అని లేఖలో పేర్కొన్నారు.