మన న్యూస్,నిజాంసాగర్,జుక్కల్, ఏళ్లు గడుస్తున్నా తనకు అధికారులు రేషన్ కార్డు జారీ చేయడం లేదని, విసుగు చెందిన యువకుడు గురువారం తహశీల్దార్ కార్యాలయం ఎదుట పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన నిజాంసాగర్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..నిజాంసాగర్ మండలంలోని మల్లూర్ గ్రామానికి చెందిన సందీప్ గౌడ్ అనే యువకుడు గురువారం నిజాంసాగర్ మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం ముందు ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. దీంతో రెవెన్యూ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. పోలీసులు తహశీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకొని సందీప్ గౌడ్ ను అడ్డుకున్నారు. సందీప్ గౌడ్ కు 2019లో వివాహం జరిగింది. వివాహం అనంతరం ఆరు నెలల తర్వాత వారి తల్లిదండ్రులతో కలిపి ఉన్న రేషన్ కార్డులో అతని పేరును తొలగించుకున్నాడు. అయితే తన భార్యతో కలిపి తనకు నూతన రేషన్ కార్డ్ ఇవ్వడం లేదని అధికారులు కావాలనే తనను రేషన్ కార్డు ఇవ్వకుండా అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ పెట్రోల్ డబ్బాతో వచ్చి తహశీల్దార్ కార్యాలయం ముందు తన ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు. ఇంతలో తహశీల్దార్ కార్యాలయం సిబ్బంది గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు వచ్చి సందీప్ గౌడ్ ను పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు. అనంతరం సందీప్ గౌడ్ ను సముదాయించి తహశీల్దార్ కార్యాలయానికి తీసుకువచ్చారు. తనకు కావాలనే రేషన్ కార్డు ఇవ్వడం లేదని తాను రేషన్ కార్డు కోసమే ఆత్మహత్య చేసుకుంటున్నానని, తనతోపాటు తహశీల్ధార్ పైన కూడా పోస్తానంటూ వాగ్వివాదానికి దిగాడు.దీంతో తహశీల్దార్ బిక్షపతి సందీప్ గౌడ్ ను సముదాయించి పంపించి వేశాడు. ఇప్పటివరకు రేషన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోలేదని, ఇప్పుడు రేషన్ కార్డు కావాలని దరఖాస్తు చేసుకుంటే ఖచ్చితంగా అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తహశీల్దార్ తెలిపారు.