మనన్యూస్:సాలూరు పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో వంద పడకల ఆసుపత్రి ఏర్పాటు నా కల అని,పూర్తి చేయుటకు చర్యలు తీసుకోవడం జరిగిందని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ,గిరిజన సంక్షేమ శాఖ మాత్యులు గుమ్మిడి సంధ్యారాణి అన్నారు.శనివారం సాలూరు పట్టణంలో శరవేగంతో జరుగుతున్న వంద పడకల ఆసుపత్రి నిర్మాణన్ని మంత్రి పరిశీలించారు.ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ 2019లో ఎమ్మెల్సీగా,టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వంద పడకల ఆసుపత్రి నిర్మాణానికి మంజూరు చేసిందన్నారు.2019లో శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు.వంద పడకల ఆసుపత్రి నిర్మాణాన్ని గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు.గిరిజన,పేద ప్రజల చిరకాల కల వంద పడకల ఆసుపత్రి నిర్మాణమని తెలిపారు.ఎక్కువ పంచాయితీలు ఉన్న సాలూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.ఈ ప్రాంతంలో ఆపద వస్తే సాలూరులో ముప్పై పడకల ఆసుపత్రి మాత్రమే ఉందని,అత్యవసర పరిస్థితులలో విజయనగరం, విశాఖపట్నం పెద్ద ఆసుపత్రులకు వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడుతోందని పేర్కొన్నారు.మార్గమధ్యలో పెషేంట్లు మరణించారనే వార్త తెలిసినప్పుడు చాలా బాధగా ఉంటోందని ఆవేదన వ్యక్తం చేశారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి దృష్టికి సమస్యను తీసుకువెళ్లడం జరిగిందని తెలిపారు.ముఖ్య మంత్రి స్పందిస్తూ తక్షణమే నాలుగు కోట్ల రూపాయల నిధులు ఆసుపత్రి నిర్మాణానికి మంజూరు చేయడం జరిగిందన్నారు. వంద పడకల ఆసుపత్రి పనులను శరవేగంతో పునఃప్రారంభించడం జరిగిందని వివరించారు. రాబోయే మూడు నెలల్లో వంద పడకల ఆసుపత్రి పనులు పూర్తి చేసి సాలూరు ప్రజలకు అంకితమిస్తామని మంత్రి తెలిపారు.రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా ముఖ్యమంత్రి పేద ప్రజలకు నాణ్యమైన విద్యా, వైద్యం సకాలంలో అందాలని నిరంతరం కృషి చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు.రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి సమైక్యంగా ఆసుపత్రి నిర్మాణంలో పాలుపంచుకోవాలని మంత్రి కోరారు.నిండు ప్రాణాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.గర్భిణీ స్త్రీల కోసం బర్త్ వెయిటింగ్ హాల్ ను ఏర్పాటు చేసి,డెలివరీ అయ్యే వరకు ఆసుపత్రిలోనే ఉంచి,పౌష్టిక ఆహారం అందించి డెలివరీ అయిన తరువాత అంబులెన్సులో ఇంటికి పంపించడం జరుగుతుందని తెలిపారు.పేదలకు వైద్యంపై భరోసా కల్పించాలని సూచించారు.అతి త్వరలోనే నాణ్యమైన,పూర్తి స్థాయిలో వైద్యానికి అవసరమైన పరికరాలతో వంద పడకల ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేస్తామని,ఆసుపత్రికి విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు లేకుండా సోలార్ పేనల్స్ ఏర్పాటు చేయడం జరుగుతుందని మంత్రి వివరించారు
అంతకముందు ఆసుపత్రి అభివృద్ది కమిటీ సమావేశంలో పాల్గొన్నారు.రూ.10.80 లక్షలతో నిర్మించిన గర్భిణీ స్త్రీల బర్త్ వెయిటింగ్ హాల్ ను ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో పార్వతీపురం డిప్యూటీ డి.ఎమ్.హెచ్.ఓ డా.కె.వి.ఎస్ పద్మావతి,సాలూరు ప్రాంతీయ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ రత్న కుమారి తదితరులు పాల్గొన్నారు.