మన న్యూస్:కాకినాడ చేపల వేటకు వెళ్లి అల్పపీడన కల్లోలిత సముద్రంలో చిక్కుకున్న నలుగురు మత్స్యకారులను కోస్ట్ గార్డ్, ఓఎన్జీసీ సంస్థల సహకారంతో బుధవారం సురక్షితంగా తీరానికి చేర్చామని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి ఒక ప్రకటనలో తెలిపారు. దీనికి సంబంధించి వివరాలు ఈ విధంగా ఆయన తెలియజేశారు. ఈ నెల 23వ తేదీన కాకినాడ , పర్లోపేటకు చెందిన నలుగురు మత్స్యకారులు వాడమొదలు ధర్మరాజు, వాడమొదలు పెంటయ్య, మల్లాడి నాని, మల్లాడి సతీష్ కలిసి పడవలో చేపల వేట నిమిత్తం బోటులో బైరవపాలెం వైపు సముద్రంలోకి వెళ్లారు. సముద్రంలో 25 నాటికన్ మైళ్ల దూరంలో వేటసాగిస్తుండగా, అల్పపీడనం కారణంగా పెనుగాలులతో కల్లోలితమైన సముద్ర అలల్లో చిక్కుకుని తీరాని రాలేక, బైరవపాలెం సమీపంలోని రిలయన్స్ రిగ్ కు చెందిన పోల్ ఒకదానికి తమ పడవను తాళ్లతో కట్టి, సహాయం కోసం మత్స్యశాఖ అధికారులను ఈ నెల 24వ తేదీన ఫోన్ ద్వారా అభ్యర్థించారు. జిల్లా కలెక్టర్ సూచనలతో మత్స్యశాఖ అధికారులు సముద్రంలో చిక్కుకున్న మత్స్యకారులను రక్షించేందుకు ఇండియన్ కోస్ట్ గార్డ్ సహాయాన్ని కోరారు. కోస్ట్ గార్డ్, ఓఎన్జిసీ రక్షణ బృందాలు సముద్రంలో చిక్కుకున్న నలుగురు మత్స్యకారులను రక్షించి, బోటుతో సహా సురక్షితంగా బుధవారం ఒడ్డుకు చేర్చాయి. కోరిన వెంటనే రక్షణ ఆపరేషన్ చేపట్టి ఎటువంటి అపాయం లేకుండా మత్స్యకారులను కాపాడిన ఇండియన్ కోస్ట్ గార్డ్, ఓఎన్జీసి సంస్థలకు జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే బంగాళాఖాతంలో నెలకొన్న అల్పపీడనం తొలగిపోయే వరకూ మత్స్యకారులెవరూ చేపల వేటకు సముద్రంలోకి వెళ్లరాదని, వాతావరణ శాఖ, మత్స్యశాఖ హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలని ఆయన కోరారు.