
నెల్లూరు, సెప్టెంబర్ 20, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె.
పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 24వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వరికుంటపాడు మండలంలో పర్యటించనున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఏర్పాట్లను ముమ్మరం చేసింది.ఇందులో భాగంగా రామాపురంలో ఏర్పాటు చేయనున్న సభా స్థలాన్ని జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు, డ్వామా పీడీ శ్రీనివాస్ ప్రసాద్, కావలి డీఎస్పీ రమణకుమార్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.సభా స్థలం వద్ద వేదిక ఏర్పాటు, బారికేడ్లు, పార్కింగ్, తాగునీరు, వైద్య సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లపై అధికారులు చర్చించారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్ అధికారులను ఆదేశించారు.ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి రూట్ మ్యాప్, ట్రాఫిక్ నియంత్రణ, పోలీసు బందోబస్తుపై డీఎస్పీ రమణకుమార్ సమీక్షించారు. పల్లె పండుగ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక మండల అధ్యక్షులతో పాటు మండల తెలుగు దేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.
