
వింజమూరు, సెప్టెంబర్ 19, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె.
వింజమూరు పట్టణంలోని సచివాలయం-1కు వెళ్లే మార్గం ప్రజలకు నరకయాతనగా మారింది. నూడా నిధులతో చేపట్టిన డ్రైనేజీ పనులు అర్ధాంతరంగా నిలిచిపోవడంతో రోడ్డు పూర్తిగా బురదమయమై రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.డ్రైనేజీ నిర్మాణం కోసం నెలల క్రితం రహదారిని తవ్వేశారు. అయితే పనులు మధ్యలోనే ఆగిపోవడంతో గుంతలు, బురదతో ఆ మార్గంలో నడవడం కూడా కష్టంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.సచివాలయం-1లో సర్ ప్రోగ్రాం, పింఛన్ దరఖాస్తులతో పాటు వివిధ ప్రభుత్వ సేవల కోసం ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తుంటారు. ప్రధాన మార్గమే ఇలా దెబ్బతినడంతో ద్విచక్ర వాహనదారులు, వృద్ధులు, చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.అధికారులు వెంటనే స్పందించి అర్ధాంతరంగా నిలిచిన డ్రైనేజీ పనులను పూర్తి చేసి, రోడ్డును మరమ్మతు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
