దళితులు, బహుజనుల రాజ్యాధికారమే లక్ష్యంగా జై భీమ్ సేన ఆక్యూరసీ..



తిరుపతి జిల్లా రేణిగుంట మండల పరిధిలోని ఓల్డ్ చెక్ పోస్ట్ వద్ద అంబేద్కర్ యువజన సంఘం నూతన కార్యవర్గ ఏర్పాటు సభ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సభకు తిరుపతి జిల్లా అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు "దళిత సింహం" తాళ్లపాక దాము, సోషల్ వర్కర్లు జయరాం, ప్రవీణ్, క్రిస్టియన్ సెల్ రాష్ట్ర కన్వీనర్/అధ్యక్షుడు రెవరెండ్ సతీష్ విజయకుమార్, జై భీమ్ సేన రాష్ట్ర వ్యవస్థాపకులు పవర్ పి. రామచంద్రన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సభను ఉద్దేశించి దళిత సింహం తాళ్లపాక దాము మాట్లాడుతూ నేటి ఆధునిక సమాజంలో కూడా దళితులు, దళిత క్రైస్తవులపై అగ్రవర్ణాల వివక్ష కొనసాగడం విచారకరమని, ఇటీవల కాలంలో వారిపై పెరుగుతున్న అసమానతలు, ఎదురవుతున్న సమస్యలపై ఆందోళన వ్యక్తం చేస్తూ బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయ సాధన కోసం యువత ఏకమవ్వాలని పిలుపునిచ్చారు. అనంతరం రేణిగుంట మండల అంబేద్కర్ యువజన సంఘం నూతన కార్యవర్గాన్ని ప్రకటించగా, మండల అధ్యక్షుడిగా కుట్టి, రాష్ట్ర కన్వీనర్గా నవీన్ (పాస్టర్) ప్రమాణ స్వీకారం చేసి సంఘం తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి నవీన్, ఎస్సీ / ఎస్టి ఎంప్లాయీస్ యూనియన్ సెక్రటరీ దుగ్గిరాల జయరాం, మాజీ సర్పంచ్ ప్రవీణ్, రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ కేఎస్ రఘు, రాష్ట్ర బీసీ సెల్ కన్వీనర్ ఎస్. సుందరం యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతు యువత కేవలం ఓటర్లుగా మిగిలిపోకుండా రాజకీయాల్లో క్రియాశీలక భాగస్వామ్యం వహించాలని, బహుజనులకు రాజ్యాధికారం అందించడమే జై భీమ్ సేన ప్రధాన ఆశయం మరియు అంతిమ లక్ష్యమని స్పష్టం చేశారు.