రేణిగుంట సెప్టెంబర్ 11. తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ బాలకృష్ణ నాయక్, జిల్లా వ్యాధి నియంత్రణ అధికారిణి డాక్టర్ శైలజ ఆదేశాల మేరకు రేణిగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ చక్రపాణి ఆధ్వర్యంలో హెల్త్ సూపర్వైజర్ కామరాజు తమ సిబ్బందితో కలిసి ఇంటింటికీ తిరుగుతూ దాగి ఉన్న క్రొత్త కుష్ఠు వ్యాధిగ్రస్తులను గుర్తించే ప్రత్యేక కార్యక్రమాన్ని రేణిగుంటలోని ఒడ్డి మిట్ట, బుగ్గ వీధుల్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా హెల్త్ సూపర్వైజర్ కామరాజు ప్రజలతో మాట్లాడుతూ శరీరంపై స్పర్శ లేని రాగి రంగు మచ్చలు, పొడలు, నొప్పి లేని పుండ్లు, కళ్ళు పూర్తిగా మూయలేకపోవడం, కనుబొమ్మలు మరియు కనురెప్పల వెంట్రుకలు రాలడం, చెవి మరియు ముక్కు తమ్మెలు మందంగా మారి ఉండడం, నూనె పూసినట్లు నిగనిగలాడే చర్మం ఉండటం కుష్ఠు వ్యాధి లక్షణాలుగా అనుమానించాలని పేర్కొన్నారు. ఈ వ్యాధి సూక్ష్మక్రిమి వలన వ్యాపిస్తుందని, రోగితో దీర్ఘకాల సంబంధం కలిగి ఉన్నవారికి గాలి ద్వారా సోకుతుందని తెలపడంతో పాటు రోగుల గౌరవాన్ని కాపాడాలని ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు డాక్టర్ చక్రపాణి, డాక్టర్ ఉదయశ్రీ, అధికారి మునిసుబ్బరామి రెడ్డి, ఆసుపత్రి సిబ్బంది, క్షేత్ర స్థాయి ఆరోగ్య కార్యకర్తలు రేవతి, విజయలక్ష్మి, లోహిత మరియు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు

