
మన ధ్యాస, మక్తల్:స్థానిక మఖ్తల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం ప్రథమ సంవత్సర విద్యార్థులకు ద్వితీయ, తృతీయ సంవత్సర విద్యార్థులు ఘనంగా ఫ్రెషర్స్ డే (స్వాగతోత్సవ వేడుకలు) నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ ఈ నారాయణగౌడ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహభరితంగా కొనసాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కళాశాల ప్రిన్సిపాల్ జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,కళాశాల స్థాయి విద్యార్థి భవిష్యత్తుకు అత్యంత కీలకమైనదని, సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ విద్యతో పాటు నైతిక విలువలను పెంపొందించుకోవాలని సూచించారు. సీనియర్, జూనియర్ విద్యార్థులు పరస్పర సహకారంతో మెలుగుతూ కళాశాల కీర్తిని ఇనుమడింపజేయాలని పిలుపునిచ్చారు.వేడుకల్లో భాగంగా జూనియర్ విద్యార్థులను సాదరంగా ఆహ్వానిస్తూ సీనియర్లు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులు ప్రదర్శించిన శాస్త్రీయ, జానపద నృత్యాలు, సినీ గీతాలకు చేసిన ప్రదర్శనలు ఆహుతులను విశేషంగా అలరించాయి. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు హరిశ్చంద్ర, తిరుపతి, బాలరాజ్, నర్సోజి, మహేష్, సులోచన, రాజేశ్వరి, నాగేంద్రమ్మ, దివ్య, నాగమణి, బాలమణి, బోధనేతర సిబ్బంది, పెద్ద సంఖ్యలో విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
