
మన ధ్యాస, కొడవలూరు,ఆగస్టు 31 : సొంత గ్రామం అభివృద్ధి కోసం యువత ముందుకొచ్చి, తమ సొంత డబ్బు, కష్టంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే ప్రతి గ్రామం మరింత అభివృద్ధి చెందుతుందని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. సోమవారం సాయంత్రం నెల్లూరు జిల్లా,కొడవలూరు మండలం, పెమ్మారెడ్డిపాళెంలో కొడవలూరు తెలుగుదేశం యువత అధ్యక్షుడు సూర్య, స్థానిక యువత సహకారంతో అభివృద్ధి చేసిన పార్కు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎంపీ, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ..... రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు తోడు సొంత ఆసక్తితో గ్రామం కోసం ఇంత కష్టపడుతున్న సూర్య, స్థానిక యువతను అభినందించారు. ఇటువంటి సూర్య లాంటి వ్యక్తులు ప్రతి గ్రామంలో ఉంటే ఎంతో అభివృద్ధి జరుగుతుందని అన్నారు. సూర్య, స్థానిక యువత సొంత డబ్బుతో, కష్టంతో అభివృద్ధి చేసిన పార్కు ప్రారంభోత్సవానికి తమను ఆహ్వానించడం సంతోషంగా ఉందని తెలిపారు. గ్రామాల్లో కూడా ఇంత స్ఫూర్తిని నింపే వ్యక్తులు ఉన్నారని చెప్పడానికి ఇదో ఉదాహరణ అని పేర్కొన్నారు. స్థానికులు రాబోయే స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవంగా గెలిపిస్తామని తనకు మాట ఇచ్చారని, వారి ప్రాంతానికి ఏ అవసరం ఉన్నా MP LADS ఎంపీ లార్డ్స్ ద్వారా కానీ, వి పి ఆర్ ఫౌండేషన్ తరఫున కానీ అవసరమైన సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.యువతకు సూర్య ఆదర్శం....కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ...... ఎన్నికల సమయంలో పెమ్మారెడ్డిపాళెం వచ్చినప్పుడు స్థానిక నాయకులు సూర్య ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ బలపడుతోందని తనకు చెప్పారని, అప్పటి నుంచి సూర్య తనకు గుర్తున్నారని అన్నారు. సూర్య ఎన్నో పనులు చేసినా ప్రచారం కోరుకోడని, అయితే తాను మాత్రం ఆయనను ప్రోత్సహిస్తూ ముందుకు రావాలని చెబుతుంటానని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తరచూ రాబోయే తరం జెన్ జడ్ దని, పేదరిక నిర్మూలనకు పి4 కీలకమని చెబుతుంటారని ఎమ్మెల్యే గుర్తుచేశారు. సీఎం ఇచ్చిన పిలుపును ఈ రోజు పెమ్మారెడ్డిపాళెంలో సూర్య, స్థానిక యువత నిజం చేసి చూపించారని అన్నారు. సొంత డబ్బుతో గ్రామ ప్రజల కోసం అద్భుతమైన పార్కును అందుబాటులోకి తీసుకురావడం గొప్ప విషయమని, ఇంత చిన్న వయసులో సూర్య లాంటి వారు పది మంది గురించి ఆలోచించడం అభినందనీయమని పేర్కొన్నారు. చాలా మంది ఈ చేత్తో చేసిన సాయం మరో చేతికి తెలియకూడదని అంటుంటారని, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా అలాంటి వారేనని అన్నారు. అయితే తాను చేసిన మంచి గురించి చెప్పాలని భావిస్తానని, ఎందుకంటే మనల్ని ఆదర్శంగా తీసుకుని ఇలాంటి సూర్యలు ఇంకా ఎంతో మంది పుట్టుకొస్తారని తెలిపారు. సూర్య సేవలు ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు. సూర్య తనను ఎలాంటి పదవులు అడగలేదని, ఆయన సేవలను గుర్తించి మండల తెలుగుదేశం యువత అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించామని ఎమ్మెల్యే తెలిపారు.పెమ్మారెడ్డిపాళెంలో రూ.63.08 లక్షల అభివృద్ధి పనులు... కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో పెమ్మారెడ్డిపాళెంలో రూ.63.08 లక్షల విలువైన అభివృద్ధి పనులు చేపట్టామని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తెలిపారు. ఇందులో ఇరిగేషన్ శాఖ ద్వారా రూ.6.47 లక్షలతో పనులు చేపట్టామని, రూ.3.50 లక్షలతో మందపాడు కాలువ సాగునీటి వ్యవస్థ పునరుద్ధరణ, రూ.2.97 లక్షలతో మందపాడు కాలువ తూములు, దెబ్బతిన్న షట్టర్ల మరమ్మతు వంటి పనులు చేశామని చెప్పారు. పంచాయతీ రాజ్ శాఖ కింద రూ.16 లక్షలతో పెమ్మారెడ్డిపాళెం నుంచి రమణారెడ్డిగుంట వరకు 3 సీసీ రోడ్లు నిర్మించామని, విద్యుత్తు శాఖ కింద రూ.21 లక్షలు ఖర్చు చేశామని తెలిపారు. ఇందులో ఆర్ డి ఎస్ ఎస్ కింద రూ.5 లక్షలతో 11 కె.వి విద్యుత్తు లైన్లు, రూ.16 లక్షలతో నాలుగు 3-ఫేజ్ ట్రాన్స్ఫార్మర్లు మంజూరు చేశామని చెప్పారు. ఆర్డబ్ల్యూఎస్ శాఖ కింద రూ.18 లక్షలు ఖర్చు చేశామని, ఇందులో రూ.8 లక్షలతో సంగయ్యపాళెంలో సీసీ డ్రెయిన్ల నిర్మాణం, జడ్పీ గ్రాంట్ కింద తాగునీటి సదుపాయం కోసం రూ.10 లక్షలు మంజూరు చేశామని, త్వరలో ఈ పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. ముఖ్యమంత్రి సహాయనిధి కింద రెండు పేద కుటుంబాల వైద్య అవసరాలకు రూ.1.61 లక్షల విలువైన చెక్కులు అందించామని, గృహనిర్మాణ శాఖ పరిధిలో సొంత స్థలాలు ఉన్న 22 కుటుంబాల ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని, త్వరలో ఈ ఇళ్లు మంజూరు అవుతాయని ఎమ్మెల్యే తెలిపారు. రాబోయే రోజుల్లో పెమ్మారెడ్డిపాళెంలో మరింత అభివృద్ధి చేసి చూపిస్తామని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి హామీ ఇచ్చారు.



